నేలకొరిగిన వరి పొలాలు
అన్నదాతలకు లక్షల్లో నష్టం
క్షేత్రస్థాయి పరిశీలనలో వ్యవసాయ అధికారులు
ఆదుకోవాలంటున్న రైతన్నలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నల్గొండ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు రీత్యా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి పొలాలు నేలకొరిగాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాన్ ఆయకట్టులో కోసిన వరి ధాన్యాలు నీటిలో మునిగి అన్నదాతలకు తీరని నష్టాన్ని కలిగించగా, ఆయకట్టులో పంట చేతికొచ్చిన సమయంలో వరి పొలాలు అకాల వర్షంతో నేలకొరగాయి. దీంతో అన్నదాతలకు తీరని నష్టాన్ని కలిగించింది. జిల్లా వ్యాప్తంగా ఐకెపి కేంద్రాలు, పొలాల వద్ద వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ద కాగా, వేలాది ఎకరాల్లో ఈనిన వరి పొలాలు నేలకొరిగాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్నదాతలకు లక్షల్లో నష్టం తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట నెలకొరగడం, నీటి మునిగిన వరి ధాన్యాలతో అన్నదాతలు బోరుమంటున్నారు.
వేలాది ఎకరాల్లో పంట నష్టం
నల్గొండ జిల్లాలో అకాల వర్షాల కారణంగా వేలాది ఎకరాల వరి పంట నేలకొరిగింది. మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం గ్రామ శివారులో ఉన్న సుమారు 450 ఎకరాల పంట పాలు పోసుకొని, గింజ పోసుకునే దశలో అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయి.మరో నెల రోజుల్లో పంట కోసే అవకాశం ఉండటం ఈ లోపే అకాల వర్షాలు పడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, త్రిపురారం, నిడమానూరు,అనుముల, తిరుమలగిరి సాగర్, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల గరిడేపల్లి హుజూర్నగర్ చిలుకూరు కోదాడ మేళ్లచెరువు మండలాలలోని అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల వరి పంట నాశనమైంది. ఒక్కొక్క ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట ఈనీ కోతుకొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు అన్నదాతలకు నట్టేట ముంచింది. మరికొన్ని చోట్ల వరి కంకులకు ఉన్న గింజలు రాలిపోయాయి. దీనివల్ల పూర్తిగా దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అన్నదాతలకు లక్షల్లో నష్టం కలగనుంది.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటల వివరాలను సేకరించినందుకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాలలో ఉన్న ఏఈఓ ల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏ ఏ గ్రామాలలో పంట ఎంత నేలకొరిగింది అనే విషయాలను రైతుల ద్వారా తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాలలో నష్టపోయిందో రికార్డులో నమోదు చేసుకుంటున్నారు. వరి పొలాలు పాలు పోసుకునే దశలో ఉంటే నేలకొరిగిన అంతగా నష్టం ఉండదని గింజలు పోసుకొని ఉన్నప్పుడే నేలకొరిగితే నష్టం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో గింజలు పోసుకొని మరో నెల రోజుల్లో కోసుకున్న దశలోనే ఉన్న వరి పొలాలే నేలకొరవడంతో రైతులకు తీవ్రం నష్టం కలిగించింది.
లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టా: తేజవత్ రుప్లా (ఐలాపురం, మిర్యాలగూడ)
నాకు మూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో సన్న రకం ధాన్యాన్ని సాగు చేశా. ప్రస్తుతం వరి పొలం పాలు పోసుకొని గింజ పోసుకునే దశకు చేరుకుంది. మరో నెల రోజుల్లో పంట చేతికి వచ్చి కోయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా నా వరి పొలం పూర్తిగా నేలకొరిగింది. ఇప్పటికే లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినాను. అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టం వచ్చింది.
ప్రభుత్వం ఆదుకోవాలి: మహిళా రైతు పద్మ (మిర్యాలగూడ)
నాకు ఐలాపురం శివారులో ఒక ఎకరం వ్యవసాయ పొలం ఉంది. దాని పైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పటికీ 30 వేల రూపాయలు ఖర్చుపెట్టి సన్న వరి రకం ధాన్యాన్ని సాగు చేసాను. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నా పంట అంతా నేలకొరిగింది. ఇప్పుడే గింజ పోసుకుని పంట చేతికి వచ్చింది. మరో నెల రోజుల్లో గింజ పడితే కోతలు చేయాలి. కానీ ఈలోపే అకాల వర్షాలు కారణంగా తమ పొలం పూర్తిగా నేలకొరిగింది. దీనివల్ల తనకు తీవ్ర నష్టం కలిగించిందని, ప్రభుత్వం పరిహారం అందించే ఆదుకోవాలి.
క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం : సైదా నాయక్ ఇన్చార్జి ఏడిఏ, మిర్యాలగూడ
అకాల వర్షాలు కారణంగా వరి పైరులు నేలకొరిగిన విషయం రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారు. వెంటనే గ్రామస్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నాం. పాలు పోసుకునే దశలో వరి పొలాలు నెలకొరిగితే అంతగా నష్టం ఉండదు. గింజ పోసుకున్న దశలో మాత్రమే పొలాలు నేలకొరిగితే నష్టం జరుగుతుంది. అలాంటి విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. వచ్చిన నివేదిక ఆధారంగా రిపోర్ట్ ను ఉన్నత అధికారులకు సమర్పిస్తాం.