వ్యవసాయ సహాయ సంచాలకులు … బి వెంకటేశ్వర రావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : అవసరమైతే రసాయనాలు వినియోగించాలని రైతులకు వ్యవసాయ సహాయ సంచాలకులు బి వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం భువనగిరీ మండలంలోని తుక్కాపురం గ్రామంలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను కార్యక్రమం జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ఆయన హాజరై, మాట్లాడారు. వ్యవసాయంలో అవసరం మేరకే రసాయనాలను వినియోగించి, నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వ్యవసాయంలో విచక్షణ రహితంగా అధిక మోతాదులో రసాయన ఎరువుల, పురుగు మందుల వినియోగం వలన పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి మరియు వ్యవసాయానికి చాల నష్టం జరుగుతుందన్నారు. నేల సారం మరియు జీవ వైవిధ్యం తగ్గడమే కాకుండ నీరు కాలుష్యం అవుతుందని, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుదన్నారు. ఎగుమతులు కూడ తిరస్కరించబడతాయన్నారు.
ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించి అధిక దిగుబడి సాధించాలన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించాలనే తపనతో పంటలకు రసాయనిక ఎరువులను విచక్షణా రహితంగా వాడుతున్నారన్నారు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను వాడాలన్నారు. భూసారాన్ని , పండించే పంటను బట్టి ఏరువులను వాడాలన్నారు. రైతులు అధికంగా వినియోగిస్తున్న రసాయనాలను తగ్గించి సాగు ఖర్చును తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా 5 అంశాలని శాస్త్రవేత్త మధుశేఖర్ వివరించారు. తక్కువ యూరియా వాడి, సాగు ఖర్చును తగ్గించుట. విక్రయ కేంద్రాల్లోని రసీదులను భద్రపరచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం. సాగునీటిని ఆదా చేసి, భావితరాలకు అందించడం. పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడటం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యావన శాఖ అధికారి మాధవి , భువనగిరి మండల తహసిల్దార్ అంజిరెడ్డి, రెవెన్యూ ఇనస్పెక్టర్ బలరామ్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రసన్న, ఆయిల్ ఫెడ్ అధికారి మౌనిక, అభ్యుదయ రైతులు మల్లేశం, మహేందర్ రెడ్డి, దానయ్య, సిద్ధా రెడ్డి, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.