అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించాం :వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తుపాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్), పీఆర్ 27 నిధులు వాడుకుని, తదుపరి 30 రోజుల్లో ఆమోదింపజేసుకోవాలనీ, నిధులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదని కలెక్టర్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని ప్రజాభవన్ నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ 48 గంటల ముందే అందరినీ అప్రమత్తం చేసిందనీ, ప్రభుత్వ యంత్రాంగం అందుకనుగుణంగా స్పందించడంతో ప్రాణ, భారీ ఆస్తి నష్టం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని ఆయన తెలిపారు. రాబోయే 24 గంటలు కలెక్టర్లు, ఇతర అధికారులు సైక్లోన్, మాన్యువల్ దగ్గర పెట్టుకొని సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. తుపాను ప్రభావం కృష్ణా జిల్లా నుంచి నల్లగొండ, ఖమ్మం జిల్లా మీదుగా వెళ్లడంతో ఉత్తర తెలంగాణలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని డిప్యూటీ సీఎం వివరించారు. అధికారులు అప్రమత్తమై పత్తి తడవకుండా టార్పాలిన్లు కప్పడం, గోదాముల్లోకి పత్తి పంటను షిఫ్ట్ చేయడంతో పత్తి పంటను కాపాడుకోగలిగినట్టు వెల్లడించారు.
తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ తుపాను సహాయ చర్యల్లో నిమగమయిందని డిప్యూటీ సీఎం తెలిపారు. భారీ తుపాను వచ్చినప్పటికీ ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తకుండా మొబైల్ వ్యాన్లు పెట్టుకొని సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు వెళ్లారని ఆయన వివరించారు. తుపాను నేపథ్యంలో రెండు డిస్కంల పరిధిలో 11. 33/11 కె.వి సబ్ స్టేషన్లు దెబ్బతినగా ఏడు సబ్ స్టేషన్లను తిరిగి పునరుద్ధరించారని తెలిపారు. కొద్దిగంటల్లో మిగిలిన నాలుగు సబ్ స్టేషన్లను పునరుద్ధరిస్తారని వివరించారు. 101. 33 కెవి లైన్లు దెబ్బతినగా అందులో 96 లైన్లను ఇప్పటికే పునరుద్ధరించినట్టు చెప్పారు. గురువారం మిగిలిన 5 లైన్లను పునరుద్ధరిస్తారని వివరించారు. 11 కెవి లైన్లు 237 దెబ్బతినగా ఇప్పటికే 227 లైన్లను పునరుద్ధరించారని వివరించారు. డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్)లు 171 దెబ్బతినగా 49 ప్రాంతాల్లో పునరుద్ధరించారనీ, మరో 122 ట్రాన్స్ ఫార్మర్లు కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం చెప్పారు. 638 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా 304 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారనీ, మరో 334 విద్యుత్ స్తంభాలు కొద్ది గంటల్లో పునరుద్ధరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు.

 
                                    