ఎండి జహంగీర్.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ – భువనగిరి: జిల్లాలోని గ్రంథాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 16 గ్రంథాలయాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయాల్లో 23 పోస్టులకు గాను కేవలం ఐదు పోస్టులు భర్తీ కాగా 18 స్థానాలు ఖాళీగా ఉన్నాయని వారు అన్నారు. వెంటనే ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది అని చాలాచోట్ల గ్రంథాలయాలను అవుట్సోర్సింగ్ వారు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. గ్రేడ్ 3 లైబ్రేరియన్ పోస్టులు 14 గాను 11 ఖాళీలు ఉన్నాయని వారు అన్నారు. ఈ స్థితిలో గ్రంథాలయాలను మెరుగుపరచడం సాధ్యం కాదన్నారు.
గత బీఆర్ఎస్ పరిపాలనలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఇదే దుస్థితి కొనసాగుతుందని దీనికి ప్రధాన కారణం సకాలంలో నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరించడమే అని వారు అన్నారు. చాలామంది నిరుద్యోగులు గ్రంథాలయాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు కానీ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న స్థితి ఉన్నదన్నారు. జిల్లా కేంద్రం గ్రంథాలయంలో సౌకర్యవంతమైన కుర్చీలు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని అందుబాటులో ఉంచాలని వారు కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను అధునాతనమైన పద్ధతిలో తీర్చిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. గ్రంథాలయాల్లో ఉన్న సమస్యలపై సీపీఐ(ఎం) తరపున రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు అందజేస్తామని వారు తెలిపారు. వీరితోపాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, మద్దెపురం రాజు, గడ్డం వెంకటేష్, నాయకులు పల్లెర్ల అంజయ్య, అన్నంపట్ల కృష్ణ, వడ్డేబోయిన వెంకటేష్, లావుడియా రాజు, ప్రకాష్, ఓవల్దాస్ అంజయ్య, భాస్కర్, పాల్గొన్నారు.