Sunday, June 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలువీడీసీ ఆగడాలకు కళ్లెం..

వీడీసీ ఆగడాలకు కళ్లెం..

- Advertisement -

– కమిటీలను రద్దు చేసుకుంటున్న గ్రామస్తులు
– సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆందోళనలతో ఎట్టకేలకు చర్యలు
– నిజామాబాద్‌ సీపీ కృషితో రెండు గ్రామాల వీడీసీలకు ఐదేండ్ల్ల జైలు శిక్ష
– స్వచ్ఛందంగా కమిటీల రద్దు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

గ్రామస్తులను తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)లు చేస్తున్న ఆగడాలకు చిన్నచిన్నగా కళ్లెం పడుతోంది. బడుగుబలహీన వర్గాలపై, వృతిదారులపై బహిష్కరణలంటూ, జరిమానాలంటూ వేధింపులకు గురిచేసేవారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామాల్లో సమాంతర పాలన నడుపుతున్న వీడీసీలపై పాలకులు కూడా చర్యలకు వెనుకాడే పరిస్థితులు ఉండేవి. వీడీసీల ఆగడాలు శృతిమించుతుండటంపై సీపీఐ(ఎం)తో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతున్నాయి. చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీడీసీలను పూర్తిగా నిషేధించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఎట్టకేలకు నిజామాబాద్‌ సీపీ చర్యలకు ఉపక్రమించారు. పాత కేసుల విచారణలను కొలిక్కి తెస్తూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ట్రయల్స్‌ వేయిస్తూ రెండు గ్రామాల వీడీసీ సభ్యులకు శిక్షలు వేయించారు. దీంతో వాటి ఆగడాలకు కళ్లెం పడ్డట్టు అయింది. ఈ క్రమంలోనే పలు వీడీసీలు తమ కమిటీలను రద్దు చేసుకుంటుండగా.. మరికొన్ని గ్రామాల్లో ఊరంతా ఏకమై వీడీసీ వ్యవస్థను వదిలించుకునే పనిలో పడ్డాయి.
నిజామాబాద్‌ జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్‌ డివిజన్‌తో పాటు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వీడీసీలు పెత్తనం సాగిస్తున్నాయి. కమిటీల్లో పేరుకు అన్ని కులాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పైకి కనిపించినా.. అందులోని పెత్తందారులు, అగ్రకులాల వారిదే పెత్తనం. ప్రధానంగా దళితులు, బలహీనవర్గాలపై, కులవృత్తిదారులపై అనేక ఆంక్షలు విధిస్తూ.. ప్రశ్నించిన వారికి గ్రామ బహిష్కరణలు, జరిమానాలు విధించడం పరిపాటిగా మారింది. వీడీసీ ఆగడాలపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా.. పాలకుల అండతో చర్యలకు వెనుకాడే పరిస్థితి. దీంతో గ్రామాల్లో వీడీసీలు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది.
మలుపుతిప్పిన తాళ్లరాంపూర్‌ ఘటన
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ గౌడ సామాజిక తరగతిని వీడీసీ బహిష్కరించి.. శ్రీరామ నవమి వేడుకలకు ఆలయానికి వెళ్లిన గౌడ కులస్తుల మహిళలను తిరిగి వెనక్కు పంపేసింది. ఈ ఘటనపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ.. ప్రజాసంఘాలతో కలిసి ఏప్రిల్‌ 13న నేరుగా గ్రామానికి వచ్చి పర్యటించారు. దీంతో వీడీసీల ఆగడాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాంతర పాలన అందిస్తూ బడుగు బలహీనవర్గాల ప్రజలను, కుల, చేతి వృత్తిదారులపై అనేక ఆంక్షలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వీడీసీలను తక్షణమే నిషేధించాలని, గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉంటూ.. వీడీసీలనే గ్రామం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌, సీపీ చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
పోలీస్‌శాఖ చర్యలు.. వీడీసీ సభ్యులకు శిక్షలు
వీడీసీల చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అప్పటి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతుతోపాటు సీపీ సాయిచైతన్య స్పందించారు. వీడీసీలు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. సీపీ సాయిచైతన్య గతంలో కేసులు నమోదైన వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. జ్యుడీషియల్‌ విచారణ తర్వాత స్పెషల్‌ కోర్టుల ద్వారా ఫాస్ట్‌ ట్రాక్‌ కేసుల ద్వారా త్వరితగతిన ట్రయల్స్‌ నిర్వహించి శిక్షలు పడేలా కృషి చేశారు. ఫలితంగా తాజాగా ఈనెల 17వ తేదీన నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని మునిపల్లి గ్రామ వీడీసీ సభ్యులైన 13 మందికి 5 సంవత్సరాల జైలుశిక్ష పడింది. అదే విధంగా జూన్‌4వ తేదీన అదే మండలంలోని కొలిప్యాక్‌ వీడీసీ సభ్యులు 15 మందికి కూడా జైలు శిక్ష పడింది. మునిపల్లిలో రోడ్డు విషయంలో నాయక్‌పోడ్‌ కులానికి చెందిన తుమ్మ రవీందర్‌తోపాటు ఆ సామాజిక తరగతి కుటుంబాలను, కొలిప్యాక్‌లో దళిత కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ విధించడం గమనార్హం.
వీడీసీలను రద్దు చేసుకుంటున్న గ్రామాలు
వీడీసీల తీరుపై అన్ని వైపుల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతోపాటు వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడంతో పలు గ్రామాల్లో మార్పు ప్రారంభమైంది. జక్రాన్‌పల్లి వీడీసీ.. తమ కమిటీని స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకుముందు ముప్కాల్‌ మండల కేంద్రంలో వీడీసీని రద్దు చేసుకున్నారు. గ్రామస్తులంతా కలిసి గ్రామ పరిరక్షణ సమితిని 27 సామాజిక తరగతులతో కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఇదే మండలంలో వెంచిర్యాల్‌, నాగంపేట్‌ గ్రామాల్లోనూ ప్రజలే ముందుకొచ్చి వీడీసీల పెత్తనం తమకొద్దంటూ కమిటీలను రద్దు చేసుకున్నారు. నందిపేట్‌లోని వెల్మల్‌ గ్రామస్తులు కూడా వీడీసీ ఆగడాలకు విసిగి.. దాని పెత్తనాన్ని తొలగించుకున్నారు. తాళ్లరాంపూర్‌ ఘటన తర్వాత వీడీసీలు ఆలోచనలో పడ్డాయి. గతంలో ఉన్న జోరు లేకుండా అంటిముట్టనట్టుగానే ఉంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -