ఏదైనా కిలో రూ.80 పైమాటే..
నవతెలంగాణ – మల్హర్ రావు
మార్కెట్లో నిత్యావసర ధరలు ఆకాన్నంటుతున్నాయి. గడిచిన వారం నుంచి మంథని, భూపాలపల్లి మార్కెట్లతోపాటు మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం నిర్వహించే వారసంతలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏం కొనటట్టు, తినేటట్టు లేదని పేద, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలకు తగ్గిన కూరగాయల సాగు..
అధిక వర్షాల కారణంగా కూరగాయల సాగు తగ్గింది.టమాట, బెండ, చిక్కుడు, అల్చింత, క్యాబేజీ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.రైతులు స్థానికంగా పండించిన సరుకు రావడం లేదు.బయట నుంచి అరకొరగా వస్తుంది.దీనివల్ల కూర గాయల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. వానలు ఇలాగే ఉంటే మరో రెండు వారాల వరకు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.దీనికి తోడు కార్తీకమాసం కావడం వల్ల ప్రజలు మాంసాహారం తినడం లేదు.కేవలం కూర గాయలపై ఆధారపడుతున్నారు.మంథని,గోదావరిఖని,భూపాలపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన కూర గాయలను ఇక్కడి వ్యాపారులు కొయ్యుర్, తాడిచెర్ల, గ్రామాల వ్యాపారులు హోల్సేల్గా కొనుగోలు చేసి ఇక్కడ రిటైల్లో అమ్ముతున్నారు.
మార్కెట్లో కిలో ధరలు…
టమాట రూ. 50,బెండకాయ రూ.60,పచ్చిమిర్చి రూ.110,బీరకాయ రూ.100.దొండకాయ రూ.100,అల్చింతకాయి రూ.80,చిక్కుడుకాయ రూ.100, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రూ.100 ఉన్నాయి.కొతీమీర,ఆకు కూరలు అడ్రస్ లేవు.



