- – తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారికి వినతి పత్రం అందజేత
- నవతెలంగాణ -వలిగొండ రూరల్
- మండల పరిధిలోని వెల్వర్తి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు స్వతంత్ర హోదా కల్పించాలని, ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డిప్యూటీ డెమో అధికారి అంజయ్య కు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వెలువర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ 2006 సంవత్సరంలో ప్రారంభించిన వెల్వర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేటి వరకు గెజిటెడ్ హోదా కల్పించలేకపోయారని దీంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులుగాని, వివిధ సంతకాల కోసం వచ్చే ప్రజలు గాని వేములకొండ ఆసుపత్రి పై ఆధారపడవలసి వస్తుందని వెంటనే స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆస్పత్రిలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండే విధంగా కేటాయించినప్పటికీ కేవలం ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో డ్యూటీ నిర్వహిస్తున్నారని మరొక డాక్టర్ ను వలిగొండకు డిప్యూటేషన్ పై పంపించారన్నారు.
గతంలో కూడా వేములకొండ, ఆత్మకూర్ కు ఇదే విధంగా డిప్యూటేషన్ లపై పంపించడం జరిగిందని పేరుకు మాత్రమే డాక్టర్లని వారిని వివిధ ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారని వెంటనే డిప్యూటేషన్లను రద్దుచేసి వెలువర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్,సిహెచ్ఓ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్వీపర్, నైట్ వాచ్ మెన్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయని వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి వెలువర్తి ఆసుపత్రి సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు కలుకూరి ముత్యాలు, వేముల అమరేందర్, నాయకులు వేముల నాగరాజు,మచ్చ భాస్కర్ తదితరులు ఉన్నారు.