అమర జవాన్ల స్తూపం వద్ద గవర్నర్తో కలిసి ఉపముఖ్యమంత్రి భట్టి నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విజయ్ దివస్ గర్వించదగిన రోజని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మంగళవారం ఆయన సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లోని అమర జవాన్ల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆనాటి భారత సైనికులు ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన రోజు విజయ్ దివస్ అని గుర్తు చేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి అమర జవాన్లను స్మరించుకోవడం గుర్తించుకోదగిన సందర్భమని అన్నారు. యుద్ధ సమయంలో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన నాటి ప్రధాని ఇందిరా గాంధీ, సైనిక నాయకులు, అమర జవాన్లందరికీ వందనాలని ఆయన చెప్పారు.



