నవతెలంగాణ-హైదరాబాద్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఐపీఎల్ విజేతగా నిలిచింది. తొలి ఎడిషన్ నుంచి కప్ కోసం నిరీక్షించిన ఆర్సీబీ.. 18 ఏళ్లకు ఛాంపియన్ అయింది. మంగళవారం అహ్మదాబాద్లో ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (43; 35 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే పరిమితమైంది. శశాంక్ సింగ్ (61 నాటౌట్; 30 బంతుల్లో 3×4, 6×6) పోరాటం వృధా అయింది.
ఎన్నో ఏళ్ల స్వప్నం నెరవేరడంతో మైదానంలోనే విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. చివరి ఓవర్లో ఆర్సీబీ గెలుపు ఖాయమైన క్షణాల్లో కోహ్లీకి కన్నీళ్లు ఆగలేదు. ఒకవైపు ఫీల్డింగ్ చేస్తూనే.. తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఆపుకునే ప్రయత్నం చేశాడు. ఇక చివరి బంతి పడ్డాక మోకాళ్లపై కూర్చుని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని ఏడ్చేశాడు. ఆ సమయంలో ఆర్సీబీ ప్లేయర్స్ కోహ్లీని చుట్టుముట్టి అభినందించారు. అనంతరం ఆటగాళ్లతో కింగ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
విరాట్ భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫాన్స్ అందరూ కూడా కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు మ్యాచ్ విజయం అనంతరం ఫాన్స్ కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. మైదానంలో అయితే ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు. నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం కోహ్లీ మేనియాతో ఊగిపోయింది. ఫాన్స్ మాత్రమే కాదు క్రికెట్ దిగ్గజాలు, ఒకప్పటి ఆర్సీబీ ప్లేయర్స్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కూడా తెగ ఆనందపడిపోయారు. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అయితే తెగ ఎంజాయ్ చేశారు.