– ఆయన యువతరానికి స్ఫూర్తి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
– వనపర్తిలో సంతాప సభ, ఘనంగా నివాళ్లు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
కేరళ మాజీ సీఎం, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వీఎస్ అచ్యుతానందన్ ప్రజాపోరాటాలు చిరస్మరణీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అన్నారు. ఆయన నేటి యువతరానికి స్ఫూర్తిని, మార్క్సిస్టు పార్టీకి శిరోధార్యమని అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల సందర్భంగా సోమవారం అచ్యుతానందన్కు సంతాపం తెలిపి.. ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. 1964లో సీపీఐ(ఎం) వ్యవస్థాపకుల్లో అచ్యుతానందన్ ఒకరని తెలిపారు. నాటి నుంచి తుది శ్వాస విడిచే వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని, పేద, మధ్యతరగతి, కార్మిక, రైతు ఉద్యమాల్లో పనిచేస్తూ సమసమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. 2006 నుంచి 11 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆ కాలంలో అనేక భూసంస్కరణలు తీసుకొచ్చి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. అంతేకాదు ఉచిత విద్య, వైద్యం అందరికీ అందే విధంగా ఎంతగానో కృషి చేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చేవారని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జైల్లో నిర్బంధించినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారన్నారు. ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఆయన ఆశయ సాధన కోసం యావత్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంతాప సభలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి.బాల్రెడ్డి, జి.ఎస్. గోపి, ఎం.రాజు, ఏ.లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
వీఎస్ పోరాటాలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES