Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలువ్యర్థాల నిర్వహణపై వార్డులవారీగా ప్రణాళిక

వ్యర్థాల నిర్వహణపై వార్డులవారీగా ప్రణాళిక

- Advertisement -

– చెట్ల నరికివేతకు పరిరక్షణ కమిటీ అనుమతులిస్తుందా? : ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ లుబ్నా సర్వత్‌
– హెచ్‌సీఎఫ్‌ ఆధ్వర్యంలో మానవహారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరంలో మున్సిపల్‌ వార్డులవారీగా వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ లుబ్నా సర్వత్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ సిటిజనన్స్‌ ఫోరం (హెచ్‌సీఎఫ్‌) ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షతన హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ మానవహారాన్ని నిర్వహించారు. ఈ ఏడాదికిగాను ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్‌గా ప్రకటించిన ఎండింగ్‌ గ్లోబల్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్స్‌ పిలుపుకు సంకేతంగా ఏడడుగుల వ్యాసంతో కూడిన గ్లోబ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను నింపి ప్రదర్శించారు. ప్లాస్టిక్‌ భూగోళాన్ని ప్రదర్శిస్తూ.. ప్లాస్టిక్‌ నుంచి భూగోళాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోరం నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులను ప్రదర్శించారు. వ్యక్తిగత, కుటుంబ జీవితాల్లోనూ ప్లాస్టిక్‌ వాడబోమంటూ ప్రతినబూనారు. మూసీ ఏవిధంగా కలుషితమవుతున్నదో, సివరేజీ వ్యర్థాలు వికారాబాద్‌ నుంచి మూసీ వరకు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ మంచినీళ్లు ఎక్కడెక్కడ, ఏవిధంగా కలుషితమవుతున్నాయో లుబ్నా సర్వత్‌ ప్రత్యేక మోడల్‌ ద్వారా వివరించారు. మ్యాపుల ద్వారా ఆ కాలుష్యాన్ని ఎలా నివారించాలో వివరించారు. ఈ సందర్భంగా లుబ్నా సర్వత్‌ మాట్లాడుతూ, మూసీ పరివాహక ప్రాంతాల్లోని కూరగాయలు విషపూరిత నీటితో పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు కలుషిత మవుతుండటంతో అక్కడి రైతులు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు కలుషిత గాలికి, నీటికి, ఆహారానికి బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు జీవో 111ను తెస్తే, దాన్ని ప్రజలే తిరగబడి ఆపారని గుర్తుచేశారు. చెరువుల కబ్జాలను ప్రోత్సహించిన అధికారులను ప్రభుత్వాలు అందలమె క్కిస్తున్నాయంటే పర్యావరణం పట్ల వారి చిత్తశుద్ధి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పాటించడం లేదని తెలిపారు. దుర్గం చెరువు నుంచి ఓల్డ్‌ సిటీ మీదుగా మూసీలోకి నీరు కలుషితమవుతున్నా అధికారులు చోద్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం మొత్తం వార్డుల వారీగా చెట్లను గణించాలనీ, వాటికి జియో ట్యాగింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రీ ప్రొటెక్షన్‌ కమిటీయే చెట్ల నరికివేతకు అనుమతివ్వడమేంటని నిలదీశారు. కాంపౌండ్‌ వారీగా ఎంత సివరేజీ ఉత్పత్తి అవుతున్నది? అది ఎక్కడ కలుస్తున్నది? అనే వివరాలతో పాటు దాని నివారణ చర్యలపై ప్రణాళిక ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంలో చెరువు లను, చెట్లను కాపాడుకుని, పర్యావరణ హితంగా నగరాన్ని మార్చాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. పర్యావరణాన్ని కాపాడకుండా ఓట్లేసిన ప్రజల మనుగడనే ప్రశ్నార్థకంగా మారిస్తే ఆ ప్రజలకు ఏం చేయాలో తెలుసన్నారు.
హెచ్‌సీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.వీరయ్య మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరాన్ని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేశారు. నగరంలో రోజురోజుకు కాలుష్యం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ తర్వాత అంతటి ప్రమాదకర పరిస్థితిలో హైదరాబాద్‌ ఉందని.. ఆ విషయంపై ప్రభుత్వం అప్రమత్తమవ్వాలని డిమాండ్‌ చేశారు. నగరంలో ఫార్మా, కెమికల్‌ కంపెనీలు పెరగడంతో కాలుష్యమూ పెరుగుతు న్నదని తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభు త్వాలు ప్రణాళికలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎఫ్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, మల్లం రమేష్‌, మోహన్‌ నాయుడు, రాజమౌళి, గోపాల్‌, సంగీత, హస్మిత, లలిత, శ్రీవల్లి, మేఘన, సైదులు, నర్సింగరావు, మోహన్‌, రఘు, రమేష్‌, రాములు పాల్గొన్నారు.

యుద్ధాల కన్నా ప్లాస్టిక్‌ ప్రమాదం
సామాజికవేత్త డాక్టర్‌ జయసూర్య మాట్లాడుతూ యుద్ధాల కన్నా ప్లాస్టిక్‌ ప్రమాదమని హెచ్చరించారు. మొదటి, రెండు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన వారికంటే ప్లాస్టిక్‌ కారణంగా చనిపోయిన, చనిపోతున్న వారి సంఖ్యే ఎక్కువని తెలిపారు. మనిషి తన వేలుతో తన కంటిని పొడుచుకున్నట్టు ప్లాస్టిక్‌ సర్వాంతర్యామిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులుగా మనమంతా క్రమశిక్షణ అలవర్చుకోవాలనీ, లేకుండా భవిష్యత్‌ అంధకారంగా మారుతుందనిహెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -