Saturday, April 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగొల్లపల్లి రిజర్వాయర్‌కు.. జీవో ఇచ్చింది బీఆర్‌ఎస్‌ కాదా?

గొల్లపల్లి రిజర్వాయర్‌కు.. జీవో ఇచ్చింది బీఆర్‌ఎస్‌ కాదా?

- Advertisement -

– ఇప్పుడు అడ్డుపుల్ల వేస్తారా ?
– పదేండ్లల్లో ‘పాలమూరు’లో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా ?
– కాసుల కోసమే మీరు ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టారా..? :హరీశ్‌రావుపై మంత్రి జూపల్లి ఆగ్రహం
– పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్‌
– సోనియా దయతోనే కేసీఆర్‌ సీఎం అయ్యారని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ద్వంద్వ నీతిని అవలంబి స్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వమే గొల్లపల్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి జీవోలు ఇచ్చి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుతగలడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శుక్ర వారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ లో ఎమ్మెల్యేలు జి. మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. 2016లో 25 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ. 4,177 కోట్లతో జీవో ఇచ్చింది గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నని జూపల్లి గుర్తు చేశారు. 2019 మార్చిలో గొల్లపల్లితో సహా 27 రిజర్వాయర్లను ప్రతిపాదించి, ఇప్పుడు అదే ప్రాజెక్టు వద్దని మాట్లాడటం పాలమూరు ప్రజలను వంచిం చడమేనన్నారు. కృష్ణాజలాల్లో 811 టీఎంసీ నీళ్లు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్‌ సంతకం చేసి అన్యాయం చేశారనీ, శ్రీశైలంలో నీళ్లు లేని సమయంలో వాడుకోవడానికి రిజర్వాయర్లు అవసరమని గతంలో మేం మొత్తుకున్నా పట్టించుకోలేదన్నారు. పాలమూ రు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయని హరీశ్‌రావు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. రూ. 80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టులో కేవలం రూ. 25 వేల కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. కనీసం కాలువల నిర్మాణం పూర్తి చేయలేదు, భూసేకరణ లేదు, పరిపాలనా అనుమతులు లేవు. ఎన్నికల ముందు హడావుడిగా పంపులు ఆన్‌చేసి ప్రజలను వంచించారు తప్ప, ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. గత పదేండ్లల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలమూరుపై రూ. 7 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రూ. 8,300 కోట్లు వెచ్చించాయని గుర్తు చేశారు.

50 టీఎంసీల మల్లన్నసాగర్‌ కోసం రైతులను ఈడ్చి పారేసి ప్రాజెక్టు కట్టిన హరీశ్‌రావుకు పాలమూరు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి, దోచుకోవడానికే గత ప్రభుత్వం ప్రాజెక్టులను వాడుకుందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ చేపట్టిన కల్వకుర్తి ప్యాకేజీ 29 పనులు నేటికీ పూర్తి కాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమనీ, హరీశ్‌రావు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. గత పదేండ్లల్లో అక్రమ కేసులు పెట్టి ప్రజాస్వామ్యం గొంతు నొక్కారనీ, ఆ కేసుల విషయంలో నేనే బాధితుడినని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. సోనియాగాంధీ దయతో తెలంగాణ ఇచ్చారు కాబట్టే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్‌ వ్యవహరించారని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనీ, రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప ఏనాడు ఎన్నికల్లో గెలవలేదన్నారు. అలాంటి వ్యక్తికి మైలేజ్‌ తెచ్చి పెట్టడానికి హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే రూ. 8 లక్షల కోట్లు అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్రనష్టం చేశారని ఆరోపించారు. నీళ్లు లేని చోట్ల మాత్రం పదేండ్లల్లో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ధనిక రాష్ట్రం అప్పగిస్తే రూ. 8 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్న జూపల్లి, పాలమూరు ప్రాజెక్టుపై రాజకీయాలు చేస్తున్నదని మీరా ? మేమా ? అని నిల దీశారు. పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -