రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హన్మకొండలో దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ తక్షణమే పునరుద్దరించాలనీ, వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. హన్మకొండ చెరబండరాజు నగర్కు చెందిన 30 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన నివాసితులు చట్టబద్ధమైన హౌస్సైట్ పట్టాలు ఉన్నప్పటికీ తాగునీటి సరఫరా అక్రమంగా నిలిపివేయడం, ఇళ్ల కూల్చివేత బెదిరింపులు చేయడం, కుల ఆధారిత వివక్షకు గురిచేయడం జరుగుతోందని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చైర్మెన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్, ఇలాంటి చర్యలు రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, గౌరవప్రద జీవన హక్కులకు విరుద్ధమని వ్యాఖ్యానించింది.
వెంటనే నీటినీ, పునరుద్ధరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను, టీజీఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. బలవంతంగా ఖాళీ చేయించే చర్యలు చేపట్టొద్దని ఆదేశించారు. కుల ఆధారిత బెదిరింపులు, వేధింపులు నివారించి బాధితులకు రక్షణ కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్కు సూచించింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలను కోరింది. కేసు విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. బాధితులతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్, గెల్లు స్రీనివాస్ యాదవ్ తదితరులు కమిషన్ ముందు హాజరయ్యారు.



