– చంద్రబాబును ఆహ్వానిస్తాం
– దీనిపై 23న మంత్రివర్గంలో నిర్ణయం
– ఏపీ, తెలంగాణ మధ్య పంచాయితీలు వద్దు
– అదే మా విధానం ొ తెలంగాణ హక్కుల్ని మాత్రం వదులుకోం
– ఏపీకి గోదావరి జలాలను మామా, అల్లుళ్లే రాసిచ్చారు : ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్రెడ్డి చిట్చాట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జల వివాదాల పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వాన్ని చర్చలకు ఆహ్వానిస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలు వద్దనేదే తమ విధానమని స్పష్టం చేశారు. ఏ సమస్య అయినా కూర్చుని మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈనెల 23న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఢిల్లీలో శుక్రవారంనాడాయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్ట్పై మాట్లాడుతూ సముద్రంలో కలిసే గోదావరి జలాల విషయంలో వాస్తవాలు, రాజకీయాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. సముద్రంలో కలిసే జలాలపై ఏపీ, తెలంగాణ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేదన్నా రు. కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించ కుండా, ఏపీ సర్కార్ కేంద్రం దగ్గరకు వెళ్లడం బీఆర్ఎస్కు రాజకీయ ఆయుధంగా మారిందన్నా రు. ఏపీ విభజన చట్టం-2014లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం అపెక్స్ కౌనిల్స్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు, మంత్రుల కమిటీ కూడా ఉందని చెప్పారు. వీటిని కాదని ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ఫీజుబిలిటి, డీపీఆర్తో కేంద్రం చుట్టూ తిరగడంతో అసలు వివాదం మొదలైందన్నారు. రెండు తెలుగు ప్రాంతాలు మధ్య నెలకొన్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందన్నారు. అనవసరమైన వివాదాలు తమకు ఇష్టం లేదని చెప్పారు. కృష్ణా-గోదావరి జలాలపై కర్ణాటక, మహారాష్ట్రతో మాట్లాడేందుకు ఏపీతో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
మనమే పరిష్కరించుకుందాం
ప్రాజెక్టుల వారీగా చర్చించి, న్యాయ, సాంకేతిక పరంగా సమస్యల్ని పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సంప్రదింపుల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు తాము సిద్ధమేననీ, అయితే ఎవరి కోసమో తెలంగాణ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి పంపకాల అంశం గత పదేండ్లలో మరింత జటిలమయ్యాయన్నారు. రాష్ట్రానికి నీటి కేటాయింపులు తేలితే, మిగిలిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఏపీ సర్కార్కు తాము పంపే ఆహ్వానంపై బీఆర్ఎస్ చేయబోయే విమర్శలకు భయపడేది లేదన్నారు.
మామా, అల్లుళ్ళే కారణం..
గోదావరి జలాలను ఆంధ్రకు రాసిచ్చిందే మామా, అల్లుళ్లు(కేసీఆర్, హరీష్ రావు) అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం నుంచి గోదావరి వరద జలాలను ఏపీకి తరలించ డానికి బీఆర్ఎస్ హయాంలోనే పునాది పడిందన్నారు. కేసీఆర్ అంగీకారం తెలపడంతో 2016, 2018లో వరద జలాలను ఏపీకి తరలించడానికి ఆనాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ రెండు జీవోలను విడుదల చేసిందంటూ వాటి ప్రతుల్ని మీడియాకు చూపారు. సముద్రంలో కలిసే 400 టీఎంసీలను పోలవరం నుంచి పెన్నా బేసిన్లోని సోమశిలకు మళ్లించడాని కి అవకాశం ఉందని వ్యాప్కోస్ కన్సల్టెన్సీ సంస్థ ఏపీ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చిందన్నారు. అయితే ఆనాడు పెన్నా బేసిన్ అని చెప్పినా, నేడు బనకచర్ల అంటున్నా రెండూ ఒకటేనని చెప్పారు. ఆ తర్వాతే ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితోనూ కేసీఆర్ గోదావరి జలాల వినియోగానికి చర్చలు జరిపారన్నారు. ఈ అంశంపై జగన్తో కేసీఆర్ నాలుగుసార్లు భేటీ అయ్యారని తెలిపారు. తెలంగాణ సీఎం హోదాలో ఏపీలో పర్యటించి రాయలసీమను రత్నాల సీమను చేస్తానంటూ గోదావరి జలాల మళ్లింపునకు బహిరంగంగానే అంగీకారం తెలిపారని వివరించారు.
బీఆర్ఎస్వి మోసపూరిత నినాదాలు
నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మోసపూరిత నినాదాలను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఇన్ని రోజులు బతికిందన్నారు. ప్రస్తుతం చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ను ఆ పార్టీ సంజీవనిలా భావిస్తోందని చెప్పారు. జలాల పేరుతో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంట్ రగల్చాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు. 10 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాజెక్ట్ల విషయంలో బీఆర్ఎస్ ఏం వెలగబెట్టిందో చెప్పాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేపట్టిన ప్రాజెక్టు లకు పేరు, ఊరు, అంచనాలు మార్చారన్నారు. దోచుకునేందుకు ఈ పనులు చేశారని ఆరోపించారు.
దేవుడే ఆశ్చర్యపోతాడు
బీఆర్ఎస్ నేతల అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్య పోతాడని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శివుడి తల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫాంహౌజ్కు గంగను దించాననీ, అక్కడి నుంచే నదులు పుట్టాయని కూడా కేసీఆర్ చెబుతారన్నారని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు మోడీకి చంద్రబాబునా యుడు అవసరం ఉందన్నారు. అలాగే చంద్రబాబు నాయుడుకు గోదావరి వరద జలాలు అవసరమనీ, తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి బీఆర్ఎస్కు పోలవరం-బనకచర్ల అవసరమన్నారు. అందుకే వీరంతా కలిసి కాంగ్రెస్ను, తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు.
299 టీఎంసీలకు ఒప్పుకుందే మీరు కాదా…?
కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలకు గాను, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ సంతకం చేసింది మాజీ మంత్రి హరీశ్రావే అని తెలిపారు. 2020 జనవరిలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) 11వ సమావేశంలోనూ తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ ఒప్పుకున్నారన్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి నేతృత్వంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనూ కేసీఆర్, హరీశ్లు ఈ కేటాయింపు లకే కట్టుబడి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేల్కొన్న హరీశ్రావు, 299 టీఎంసీల ఒప్పందంతో తెలంగాణ కు అన్యాయం జరుగుతోందని ఆనాటి జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు లేఖ రాసారన్నారు. ఇందులో 2015లో జరిగిన ఒప్పందంతో తెలంగాణకు ఉరి అని ఒప్పుకున్నారని అన్నారు. అందువల్ల 811 టీఎంసీల్లో 50:50 నిష్పత్తిలో కేటాయింపులు చేయాలని కోరినట్లు చెప్పారు. కానీ తాము కృష్ణా నదిలో నదిలో 500 టీఎంసీలు బ్లాంకెట్గా ఇవ్వాలని కోరుతుంటే హరీశ్రావు విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన లెక్క ప్రకారం 50:50 నిష్పత్తిలో పంపకాలు చేసినా తెలంగాణకు వచ్చేది దాదాపు 405 టీఎంసీలే అన్నారు. అంటే హరీశ్రావు కన్నా తాము 100 టీఎంసీలు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నామని వివరించారు.
కాళేశ్వరానికి రూ.96 వేల కోట్లు చెల్లించాం
కాళేశ్వరం ప్రాజెక్ట్కు ఇప్పటి వరకు రూ.1,27,872 కోట్ల టెండర్లు పిలవగా, రూ. 95,902 కోట్లు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. ఇంకా రూ.50 వేల కోట్ల పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అన్ని కాంపోనెంట్స్ పూర్తి కావాలంటే ప్రాజెక్ట్ వ్యయం రూ. 2 లక్షల కోట్లు చేరుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్తో కేవలం ఒకే సీజన్కు 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రికార్డ్ స్థాయిలో పండిన వరికి ఈ ప్రాజెక్ట్తో అణువంత సంబంధం కూడా లేదన్నారు.
కేటీఆర్కు కిషన్రెడ్డి లైజనింగ్ ఆఫీసర్
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేసీఆర్ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అలాగే కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసర్ కిషన్రెడ్డి అంటూ విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవధానం చేసి బీజేపీని గెలిపించిందని చెప్పా రు. అందుకు బదులుగా బీఆర్ఎస్ పార్టీని కాపాడేం దుకు కిషన్రెడ్డి పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్లాల్ ఖట్టర్తో తన అపాయింట్మెంట్లు ఉన్న విషయం తెలుసుకొని తనకన్నా ముందే కిషన్రెడ్డి ఆ ఇద్దరు మంత్రులను కలిసారన్నారు. అక్రమ ఆస్తులు బయటపడతాయనే భయంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వేలో పాల్గొనలేదన్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, కవితలు మాత్రం కుల సర్వే చేసుకున్నారని చెప్పారు. క్యాబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం డిజైన్లని చెప్పిన ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు కిషన్రెడ్డి సమాధానం చెప్పాల న్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు కాళేశ్వరంను కేసీఆర్కు ఏటీఎంలా మార్చారని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు ఎవరికి మేలు చేస్తాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
మిగులు జలాలు తేలేది అప్పుడే…
తెలంగాణలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి అయితేనే, అసలు-మిగులు జలాల లెక్క తేలుతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు అర్థం చేసుకోవాలని కోరారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీలు దక్కాయన్నారు. అయితే పదేండ్లుగా తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టుకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఫలితంగా వివిధ దశల్లో ప్రాజెక్టులు వాయిదా పడుతూ వస్తున్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అప్రైజల్ కమిటీ, పర్యావరణ, సీడబ్ల్యూసీ అనుమతులపై కేంద్రం వేగంగా స్పందిస్తోందన్నారు. బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై ఏపీ డీపీఆర్ సమర్పించకపోయినా, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ ప్రాజెక్ట్పై చర్చించారని చెప్పారు. కానీ 18 నెలలుగా కేంద్ర మంత్రులను తాను, రాష్ట్ర మంత్రులు కలిసి విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. ఏపీలో పోలవరం, తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టారని గుర్తుచేశారు. అయితే ఈ ప్రాజెక్టుల్లో ఏ చిన్న మార్పు చేసినా పునర్విభజన చట్టం-2014 ప్రకారం మరో రాష్ట్రానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఈ నిబంధన ప్రకారం, పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తరలించే ప్రాజెక్ట్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి పొందాల్సిందేనని స్పష్టం చేశారు.
జలవివాదాలు చర్చలతోనే పరిష్కారం
- Advertisement -
- Advertisement -