Sunday, June 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమళ్లీ నీళ్ల లొల్లి!

మళ్లీ నీళ్ల లొల్లి!

- Advertisement -

బనకచర్ల పేరుతో పొలిటికల్‌ హైడ్రామా
వాదోపవాదాల్లో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌
ఆటలో అరటిపండులా బీజేపీ
స్థానిక సమరంలో పైచేయి కోసం పోటాపోటీ
త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

బనకచర్ల…ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిక్‌. మిగిలిన ప్రజాసమ స్యలన్నింటినీ పక్కకు నెట్టేసి, రెండు రాష్ట్రాల సీఎంలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఇద్దరం కూర్చుని మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటామని చెప్తున్నారు. రెండు రాష్ట్రాల సమస్యను ఢిల్లీ చుట్టూ తిప్పి, మన బలాలు, బలహీనతల్ని మోడీ సర్కార్‌ చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) రాజకీయ ఎత్తుగడ ఫలించినట్టే కనిపిస్తుంది. బీజేపీకి మేం వ్యతిరేకం అని బీఆర్‌ఎస్‌ ప్రకటించినా, వారి పట్ల ప్రజల్లో అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ఇదే విషయంలో కవిత రూపంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ముసలం పుట్టిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లే గల్లంతై, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసే ధైర్యం కూడా చేయలేక చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌కు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకోవడం తప్ప నిసరి. అక్కడా దెబ్బతింటే, ఇక పార్టీ భవిష్యత్‌ పైనే అనుమానాలు తలెత్తే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బనకచర్ల సమస్య తీవ్రమైందే. దానిపై కచ్చితంగా చర్చ జరగాల్సిందే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు అసలు విషయాన్ని వదిలేసి నీది తప్పు అంటే, కాదు నీదే తప్పు అని రాజకీయ విమర్శలకు దిగడం ప్రజా సమస్యల్ని పక్కతోవ పట్టిస్తున్నట్టే ఉంది! కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రత్యారోపణల మధ్య బీజేపీ ఆటలో అరటిపండులా, గోడమీది పిల్లిలా కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అంటూ ముక్తాయింపునిస్తున్నది.
ఏపీ వాదన
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్ట్‌ను సమర్థించుకుంటూ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్లు చేసింది. వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వాడుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులపై ప్రత్యారోపణలు చేస్తుంది.
కేంద్రం చోద్యం
కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఈ వ్యవహారంలో చోద్యం చూస్తున్నది. అపెక్స్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ రెండు రాష్ట్రాల మధ్య నీటివాటాల సంగతిని తేల్చకుండా, కేవలం ఈ ఒక్క సమస్యపైనే అపెక్స్‌ కమిటీ సమావేశం ఏంటని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది.
బీజేపీ డబుల్‌రోల్‌
బనకచర్ల జలవివాదంలో రాష్ట్ర బీజేపీ నేతలు నీళ్లు నములుతున్నారు. పైకి తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని చెప్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సమస్యను పరిష్కరించాల్సిన వారే, వారి ప్రభుత్వానికే వినతిపత్రాలు ఇచ్చుకోవడం విచిత్రం. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలోనూ ‘కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని చెప్పి ఆపార్టీ నేతలు సైలెంట్‌ అయిపోయారు. బహుశా మోడీ సర్కారుకు చంద్రబాబు అవసరం ఆపార్టీ నేతల్ని గట్టిగా మాట్లాడనివ్వట్లేదేమో అనే చర్చ ప్రజల్లో జరుగుతున్నది.
స్థానిక సమరం
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాల్లోనూ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారులతో చర్చలు జరిపారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.
ఇదీ వ్యూహం
స్థానిక సమరంలో క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని తమ పక్షానికి అనుకూలంగా మలుచుకొనేందుకు బనకచర్ల అంశం కూడా రాజకీయపార్టీల అజెండాలో చేరే అవకాశం ఉంది. రైతు పక్షపాతులం అని చెప్పుకొనేందుకు అధికార, ప్రతిపక్షపార్టీలు దీన్నే ప్రధాన అంశంగా తీసుకొని ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు.
ట్రిబ్యునళ్లతోనే పరిష్కారం
సారంపల్లి మల్లారెడ్డి, సాగునీటి రంగ నిపుణులు

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సాగునీటి సమస్యలు పరిష్కరించాలి. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాల లెక్కలు తేల్చాలి. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీతోపాటు అపెక్స్‌ కౌన్సిల్‌ సమన్వయంతో ముందుకుపోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ, సమస్యల పరిష్కారం దిశగా సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
23న క్యాబినెట్‌లో చర్చ
బనకచర్ల అంశంపై ఈనెల 23వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను కోరుకోవట్లేదని ఢిల్లీలో చెప్పారు. చర్చల కోసం ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఆహ్వానిస్తాననీ, దానిపై బీఆర్‌ఎస్‌ చేసే రాజకీయ కువిమర్శలకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.
ఇదీ సమస్య
పోలవరం నుంచి వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నందున ఆ నీటిని రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో కృష్ణానదికి మళ్లించి, అక్కడి నుంచి 200 టీఎమ్‌సీల నీటిని మూడు భాగాలుగా 417 కిలోమీటర్ల దూరంలో నంద్యాల జిల్లాలోని బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించాలనేది ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదన. దీనికే గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్ట్‌ అని పేరు పెట్టారు.
అభ్యంతరం
ఎగువ రాష్ట్రం తెలంగాణను సంప్రదించకుండా, చంద్రబాబు సర్కార్‌ బనకచర్లపై డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేసి, అనుమతుల కోసం కేంద్రప్రభుత్వం చుట్టూ తిరగడంతో అగ్గి రాజుకుంది. అసలు నదీజలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాలే నిర్థారణ కానప్పుడు, వరద జలాలను ఎలా లెక్కిస్తారనే దానితో వివాదం ఏర్పడింది.
రాజకీయ ఆరోపణలు
దీనిపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలే చేసింది. ఏపీకి దాసోహం అంటున్నారంటూ ప్రాంతీయవాదాన్ని మరోసారి రెచ్చగొట్టేలా ఆపార్టీ నేతలు ప్రకటనలు చేశారు. దీనితో సమస్య తీవ్రతను గుర్తించిన సీఎం రేవంత్‌రెడ్డి మందీ మార్బలంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి బనకచర్లను అడ్డుకోండని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -