రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది
పాలనంటే నల్లేరు మీద నడక కాదు
2047 నాటికి అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ
జీడీపీలో 10 శాతం వాటా…
మూడు ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యం : రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”పాలనంటే నల్లేరు మీద నడక కాదు. గతంలోని తప్పులను సరిదిద్దుతున్నాం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రజల ఆకాంక్షలే మా ప్రభుత్వ ఎజెండా. 2047 నాటికి అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాలి. జీడీపీలో 10 శాతం వాటా… 3 ట్రిలియన్ల ఎకానమీ సాధించడమే మా ప్రభుత్వ లక్ష్యాలు… ” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా తెలంగాణ రైజింగ్ పేరుతో విజన్ డాక్యుమెంట్ను తీసుకొచ్చి రంగాల వారీగా విధానాలను ప్రకటిస్తున్న విషయాలను ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాన్ని ఆదర్శ రాజకీయాలకు, అభివృద్ధికి మార్గదర్శకంగా నడుపుతున్నామని తెలిపారు. అలాంటి గొప్ప లక్ష్యం కోసం అందరం ఒక్కటిగా ముందుకెళ్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్స్లోని సైనిక అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ఆయన సంతకం చేశారు. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ డాక్టర్ జితేందర్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఓపెన్ టాప్ జీప్లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 19 మంది పోలీస్ సిబ్బందికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి రాష్ట్రపతి మెడల్ను, 11 మందికి మెడల్స్ను అందజేశారు. తొమ్మది మంది కవులు, కళాకారులు, పాత్రికేయ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జపాన్లోని కితక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ హాజరయ్యారు. వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో సాంస్కతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు, సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించి పదేండ్లు గడిచినా ఆకాంక్షలు నెరవేరక ప్రజలు ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే క్రమంలో అప్పటికే అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, నిర్వీర్యమైన వ్యవస్థల్లో జరిగిన తప్పులను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టడాన్ని బాధ్యతగా స్వీకరించినట్టు తెలిపారు. జనం ఆశలే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణం దిశగా ప్రయత్నిస్తూ ముందుకు కదులుతున్నామన్నారు. ప్రజల ఆలోచనే తమ ఆచరణ అని సీఎం స్పష్టం చేశారు. యూనివర్సిటీల వీసీల నియామకం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, పోటీ పరీక్షల నిర్వహణ, విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, సమాచార కమిషనర్లు, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ”ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీని ఆవిష్కరించుకున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాం. మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించాం. పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ, యూనిఫాంల కుట్టుపనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చేందుకు వీలుగా మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి.. ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తున్నాం. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేశాం. మిగిలిన 450 బస్సులను త్వరలో అందజేస్తాం. మహాలక్ష్మి పథకం ద్వారా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం… ” అని సీఎం తెలిపారు. రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేసి, వారికి ప్రతీ సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరచనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఎనిమిది నెలల్లో 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రూ.15,333 కోట్లతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం ఎకరాకు రూ.12 వేలకు పెంపు, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్తో రైతులకుఅదనపు ఆదాయం కల్పించడంతో రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. దీంతో 275 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని వెల్లడించారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తెచ్చామనీ, భూహక్కుల రికార్డులు పక్కాగా నిర్వహించి, భూ యజమానులకు భరోసా కల్పిస్తున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 60 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించినట్టు సీఎం తెలిపారు. డీఎస్సీ ద్వారా 10 వేల మందికి పైగా ఉపాధ్యాయ నియామకాలతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రయివేటు రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు వివరించారు. అన్ని రంగాల ఖాళీల భర్తీతో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించామన్నారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, యువతకు నైపుణ్య శిక్షణ కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామనీ, ఒలంపిక్స్లో పతకాల సాధనే లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పబోతున్నట్టు వెల్లడించారు.
మెరుగైన విద్యావ్యవస్థ ఏర్పాటు కోసం విద్యా కమిషన్ సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నదని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్లో డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంలో భాగంగా, తొలి దశలో రూ.11,600 కోట్లను వెచ్చిస్తున్నట్టు తెలిపారు. 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నామనీ, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు.
కులగణనతో దేశానికి ఆదర్శంగా నిలిచామనీ, రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనతో పాటు కులగణన చేయనున్నట్టు ప్రకటించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన ద్వారా బీసీలు 50.36 శాతమని తేల్చినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పటికే శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనీ, మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్ధత కల్పించినట్టు తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదల కోసం నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేసి, రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నామన్నారు. మే 20 నాటికి 5,364 మంది లబ్దిదారులకు 53.64 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు సీఎం తెలిపారు. పేదలకు సన్న బియ్యం పంపిణీతో విప్లవాత్మకమైన మార్పు తెచ్చినట్టు చెప్పారు.
దావోస్, సింగపూర్, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించి రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐటీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్.సీ.ఎల్, కాగ్నిజెంట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో తమ సంస్థలను విస్తరిస్తున్నాయన్నారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును చేపడుతున్నామనీ, బాపూఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో గాంధీ సరోవర్గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు వీలుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించామనీ, హైదరాబాద్ నగర అభివద్ధి లక్ష్యంగా దాదాపు రూ.18 వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు.
రూ.24వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖను మరింత పటిష్టపరిచామని, డ్రగ్స్పై ఉక్కు పాదం మోపేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్గా నిలిచిందనీ, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగానికి దుబారులో అంతర్జాతీయ అవార్డు లభించిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్ కార్యక్రమంతో హైదరాబాద్ను అంతర్జాతీయ వేదికగా మార్చినట్టు సీఎం తెలిపారు. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారులు రాష్ట్రంలో చారిత్రక, పర్యాటక ప్రదేశాలను సందర్శించి ప్రపంచ నలుదిశగా చాటారని చెప్పారు.
సరిదిద్దుతున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES