గ్రూప్-1 ఉద్యోగాల భర్తీని కోర్టు దాకా తీసుకెళ్లిన బీఆర్ఎస్
వందల మందికి ఉద్యోగాలిచ్చి ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించింది
చేసిన పనులు చెప్పుకునే ఆనవాయితీ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు
రాష్ట్రంలో అర్హులందరికీ ఇండ్లు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ- బోనకల్
గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ సరి చేస్తున్నామని, తక్కువ కాలంలో వందల మందికి గ్రూప్ -1 ఉద్యోగాలు ఇచ్చి ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నారాయణపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి కూడా గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. పారిశుధ్య కార్మికులు, పంచర్లు వేసుకునే వారి బిడ్డలు, పేద రైతులు, రోజువారి కూలీల బిడ్డలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తే వారి కష్టాన్ని అవహేళన చేసే విధంగా కొద్దిమంది మాట్లాడటం బాధాకరంగా ఉందని తెలిపారు. చేసిన పనులు చెప్పుకునే సంప్రదాయం కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేదన్నారు. కానీ కొన్ని ప్రభుత్వాలు ఏమి చేయకుండానే అన్నీ చేసినట్టు భ్రమలు కల్పించి ప్రజలను ఆ భ్రమల్లో ఉంచి అన్నీ పూర్తి చేశామని ప్రచారం చేసుకుంటారని విమర్శించారు.
రాష్ట్రంలో ఇల్లు లేని పేద కుటుంబం ఉండరాదనేది తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. 100 పడకల ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని, లేదంటే పాదయాత్ర చేస్తామని మధిర పట్టణంలో ఓ పెద్దాయన ప్రకటించారని, పనులు పూర్తి చేయకుండా ఆస్పత్రిని ఎలా ప్రారంభిస్తామని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తాను మధిరలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బండారు నరసింహారావు, డీసీసీబీ చైర్మెన్ దొండపాటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ అంబటి వెంకటేశ్వర్లు, మధిర ఆత్మ కమిటీ చైర్మెన్ కర్నాటి రామకోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.