సీఎం రేవంత్రెడ్డిని కలిసిన విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విన్గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎంను విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ మర్యాదపూర్వకంగా కలిశారు. తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో… తెలంగాణ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులను స్థాపించడానికి ఫామ్ సాన్ చౌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ యూనిట్లు, బ్యాటరీ నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే ఆసక్తిని సీఎంకు వివరించారు. హైదరాబాద్ నగరం సమీపంలో ప్రభుత్వ ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీపై విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ ప్రత్యేక ఆసక్తిని చూపించారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటు పట్ల సీఎం దార్శనికతను ఆయన అభినందించారు. అక్కడ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి.. ఫామ్ సాన్ చౌతోపాటు విన్గ్రూప్ చైర్మెన్ ఫామ్ నాట్ వూంగ్లను ఆహ్వానించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, సెక్రెటరీ కోఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నాం
- Advertisement -
- Advertisement -



