ప్రతిపాదనలను అధ్యయనం చేస్తాం : జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్రంగ అభివృద్ధిలో భాగంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగంపై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం జర్మనీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లతోపాటు గృహ జ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా రైతులు, గృహ జ్యోతి వినియోగదారులకు ప్రతినెలా కచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. జర్మన్ ప్రతినిధులు సూచించిన సోలార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ను ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ, రెడ్కో సీఎండీ అనిలా , జర్మన్ ప్రతినిధులు డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.
సోలార్ విద్యుత్ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES