– కంచ గచ్చిబౌలి కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
– మంచి ప్రణాళికతో వస్తే ప్రశంసిస్తామన్న సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : కంచ గచ్చిబౌలి ప్రాంతానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించే ప్రక్రియలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మంచి ప్రణాళికతో వస్తే, ప్రశంసలు ఇస్తామని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కంచ గచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్ ది ఛేంజ్ సొసైటీ, ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లపై బుధవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ ” ప్రస్తుతం ఆ స్థలంలో అన్నీ పనులు ఆగిపోయాయి. దీనిపై ఏ ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు మేము అడవులు, చెరువులు మొదలైన వాటిని కాపాడే విస్తృత ప్రణాళికతో రూపొందిస్తున్నాం” అని కోర్టుకు నివేదించారు. ఇందుకు కోసం కొంత సమయం పడుతుందని తెలిపారు. ప్రణాళికలను రికార్డు రూపంలో అందించడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం కావాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థలనపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ మంచి ప్రతిపాదనతో రావాలని సూచించారు. ”మీరు మంచి ప్రతిపాదన తీసుకువస్తే, మేము అన్నింటినీ (రాష్ట్రంపై సుమోటోగా చర్యలు) ఉపసంహరించు కుంటాం. అలాగే అన్ని ఆంక్షలు ఎత్తేసి నిజమైన ప్రశంస ఇస్తాం. మాకు కావలసింది పర్యావరణం రక్షించబడటం” అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసిన అటవిని పునరుద్ధరించాలన్నారు. అయితే… తన రిటైర్మెంట్ లోపు ఈ ప్రణాళికను సమర్పించాలని ఆదేశించారు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అటవీ పునరుద్ధరణ పై సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నాం
- Advertisement -
- Advertisement -