వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాణించడం గొప్ప విషయం : పైలట్ ప్రాజెక్టుపై సమీక్షలో మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్రాన్స్జెండర్లను సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నామనీ, వారికి అంగవైకల్య కోటా కింద ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) చెప్పారు. ట్రాన్స్జెండర్ల సాధికారత, భాగస్వామ్యం వైపు ఒక కీలక అడుగు వేస్తూ 2024 డిసెంబర్లో హైదరాబాద్లో 44 మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. వారికి గౌరవప్రద ఉపాధిని కల్పించడానికి ఇది ఒక ముఖ్యమైన చర్య అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్ వర్గాన్ని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణనే అని గర్వంగా చెప్పారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల నియామకం పైలట్ ప్రాజెక్ట్పై సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్ష జరిగింది. అందులో డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, ట్రాఫిక్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. హైదరాబాద్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల విధులు అందరినీ సంతృప్తి పరిచాయని అభినందించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు వైద్యం కోసం ఇప్పటికే మైత్రీ క్లినిక్లు ఏర్పాటు చేశామని, ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా వారికి మరిన్ని అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనితా రామచంద్రన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఈ మహత్తర చర్యకు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తోందన్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ట్రాన్స్జెండర్లను నియమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పారు. సీవీ.ఆనంద్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం డిసెంబర్ నెలలో కేవలం 10 రోజులలో ట్రాన్స్జెండర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీసు ట్రాఫిక్ విభాగంలో 38 మంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆరు నెలల్లో వారిపై ఒక్క చిన్న ఫిర్యాదు కూడా రాలేదని గర్వంగా తెలిపారు. మంచి పేరు వచ్చే విధంగా బాధ్యతతో పని చేస్తే ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తుందని సూచించారు. శైలజ మాట్లాడుతూ…వారి సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ట్రాఫిక్ అసిస్టెంట్లు మాట్లాడుతూ.. ఒకప్పుడు పోలీసులంటేనే భయపడే వారమనీ, ఇప్పుడు వారితో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు చాలా ధైర్యం వచ్చిందనీ, సమాజంలో గౌరవం పెరిగిందని చెప్పారు. హౌంగార్డులకు ఉన్న సౌకర్యాలు తమకు కల్పించాలని కోరారు.
ట్రాన్స్జెండర్లను సమాజంలో భాగస్వామ్యం చేస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES