వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని విద్యారంగ అభివృద్ధి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడటం విద్య ద్వారానే సాధ్యం’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఓ ప్రయివేటు సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెనుకబాటు తనాన్ని రూపుమాపాలన్నా, సమ సమాజ స్థాపనకు ముందడుగు పడాలన్నా విద్య ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. మాజీ ప్రధాని నెహ్రూ వేసి పునాదులు, అనేక మంది ప్రధానులు, సీఎంలు తీసుకొచ్చిన విధానాలతో విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఐఐఐటీలు, ఆర్ఈసీలు, యుజీసీ ఆధ్వర్యంలో పలు యూనివర్సిటీల ఏర్పాటు మూలంగా తెలుగువాళ్లు ప్రముఖ కంపెనీల సీఈఓల స్థాయికి ఎదిగారని వివరించారు. వ్యక్తులు స్థాపించిన విద్యాసంస్థలు యూనివర్సిటీల స్థాయికి ఎదిగి అడ్వాన్సుడ్ టెక్నాలజీని బోధించే స్థాయికి చేరాయన్నారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారితేనే ప్రయోజనం అని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ భావించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. పరిశ్రమలకు పనికొచ్చేలా సిలబస్ రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన 100 ఐటిఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామనీ, వివిధ పరిశ్రమల అధిపతులు సూచించిన సిలబస్ ను వాటిలో ప్రవేశపెట్టామని తెలిపారు. రూ.200 కోట్ల పెట్టుబడితో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కోటి ఉమెన్స్ కాలేజీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి రూ.500 కోట్లతో భవన నిర్మాణాలు చేపడుతున్నామనీ, ఉస్మానియా యూనివర్సిటీలో కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామనీ, బీసీల నియామకం చేశామని తెలిపారు. తెలంగాణలో దశాబ్ద కాలంగా నిర్లక్ష్యానికి గురైన విద్యావైద్యంపై దృష్టి సారించామన్నారు. రాబోయే 50ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు ప్రయివేటు సంస్థలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.