ఉద్యోగులకు భద్రతలేదు.. పెన్షనర్లకు భవిష్యత్ కరువు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగుల హక్కులను హరిస్తున్నా రని, పెన్షనర్ల ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని.. హక్కుల సాధన కోసం పెన్షనర్లు ఉద్య మించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాలుగో మహాసభ మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని గంగపుత్ర భవన్లో నల్ల లింగయ్య ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు దివిల వెంకటరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. పెన్షనర్లు ప్రశాంతంగా గడపలేని పరిస్థితి.. బయట తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలు, హక్కులను ప్రధాని మోడీ విస్మరించారన్నారు. పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అవసరం లేదనే కొత్త సూత్రం చెబుతున్నారని విమర్శించారు. పైసాపైసా కూడబెట్టి కట్టిన జీఎస్టీ పన్నులను రాయితీల రూపంలో ఆదానీ, అంబానీకి, కార్పొరేట్ పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెడుతు న్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ ప్రజల సౌక ర్యాలను విస్మరించి ట్రంప్ ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా అవసరాలను పట్టించుకోకుండా ఉద్యోగులను, పెన్షనర్లను మానసిక వేదనకు గురిచేస్తున్నారని అన్నారు. సౌకర్యం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని పెంపొందించుకుంటూ ఉండగా.. ఆ పరిజ్ఞానం లేదని సీనియర్ ఉద్యోగులను తొలగించడం దుర్మార్గమన్నారు. దేశంలో గతంలో ఫిక్స్టర్మ్ ఎంప్లాయి విధానంతో ఒక సంవత్సరం పనిచేసినా గ్రాట్యుటీ ఇస్తామని చెబుతూనే.. ఉద్యోగులను ఒకటి రెండేండ్లు పని చేయించుకుని ఇంటికి పంపించే విధానాలు తీసుకురావడం దుర్మార్గమన్నారు. మోడీ విధానాల మూలంగా దేశంలో ఉద్యోగులకు భద్రత లేదని, పెన్షనర్లకు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని అన్నారు. దేశంలో కరోనా కాలంలో వైద్యం అందక మృతిచెందిన అనాధ శవాలకు అంతిమయాత్ర చేయలేని పరిస్థితి నెలకొందని, చైనా, క్యూబాలో ఆధునిక వైద్య పరిజ్ఞానంతో ఐదు గృహాలకు ఒక వైద్యుడిని నియమించి ప్రజలను కాపాడుకున్నారని గుర్తు చేశారు.
ప్రధాని మోడీ ప్రపంచ బ్యాంకు విధానాలు, ట్రంప్ ఆదేశాలతో దేశాన్ని పరిపాలిస్తున్నారని విమర్శించారు. వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నేటి సమాజంలో పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటన్నిటి సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దివిటి వెంకటరాజు, కాయిత వీరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ లింగ అరుణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి తూపురాని సీతారాం, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే యాకూబ్, ఆర్టీసీ ఏడీ సిఆర్ ముత్తయ్య, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ వెంటపల్లి సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షులు మల్లయ్య, తొర్రూరు అధ్యక్షులు పి.రాజయ్య, ప్రముఖ కీళ్ల మార్పిడి వైద్యులు కంచర్ల సుధీర్, దార ముత్తయ్య పాల్గొన్నారు.



