పాలడుగు భాస్కర్
మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ అనుబంధం) 4వ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ మహాసభ అక్టోబర్ 26, 27 తేదీల్లో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో జరుగుతుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే మహాసభల్లో మొదటి రోజు జరిగే బహిరంగ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ మాట్లాడుతూ మహాసభకు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. గడిచిన మూడేండ్లలో చేసిన పోరాటాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన కోసం చర్చించనున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై.స్వప్న, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ పాల్గొన్నారు.