– పర్యావరణాన్ని రక్షించుకోకుంటే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విచ్చల విడిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించకుంటే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నప్పటికి ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వ్యర్థాల మూలంగా సహజ వనరులు కలుషితం కావడంతో సమస్త జీవరాశులకు పెను ముప్పు వాటిల్ల బోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1960, 1970ల నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్ పెద్ద ఎత్తున పేరుకుపోతున్నట్టు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 12.65 కోట్ల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోందని పేర్కొన్నారు.
2026 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు పైగా ఉంటుందని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారని వివరించారు. ఇదే ధోరణి కొనసాగితే, 2050 నాటికి ఈ సంఖ్య 1,200 కోట్ల టన్నులకు చేరవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి వాడకాన్ని తగ్గించడంతో పాటు చెట్లను విరివిగా నాటాలని కోరారు. గతేడాది తెలంగాణ ప్రభుత్వం 20.2 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 19.04 కోట్ల మొక్కలను నాటామని తెలిపారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు విద్యార్థులు, యువత, పర్యావరణ ప్రేమికులు, సామాజిక కార్యకర్తల భాగస్వామ్యంతో విసృత ప్రచారం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి గూగులోత్, బోర్డు మెంబర్లు సత్యనారాయణరెడ్డి, విజయ లక్ష్మీ, జయదేవ్, ఉద్యోగులు, సిబ్బంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES