సమన్వయంతో పార్టీ, ప్రభుత్వం : రాహుల్, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల కంటే మున్సిపల్ ఎలక్షన్స్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మున్సిపల్ పోరులో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్వే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్లతో సీఎం విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయానికి సంబంధించిన రిపోర్ట్ను వారికి అందజేశారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై వివరించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దక్కాయనీ, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని తెలిపారు. అలాగే తాజాగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలు బుధవారం జరిగాయనీ, శుక్రవారం (నేడు) ఆ ఫలితాలు వెలువడనున్నాయని వివరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేత వంటి కార్యక్రమాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని రాహుల్, కేసీలకు రేవంత్ వివరించారు. ఉద్యోగ నియామకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనుల గురించి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. రెండేండ్లలో చేసిన పనులను వివరించేందుకు సభల ఏర్పాటుతో క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి సానుకూలత ఉందని అగ్రనేతలకు రేవంత్రెడ్డి వివరించారు. క్షేత్రస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడంపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్.. సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.
మెరుగైన ఫలితాలు సాధిస్తాం
- Advertisement -
- Advertisement -



