ఉమర్ ఖలీద్కు బెయిల్ నిరాకరణపై కపిల్ సిబల్
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రాజకీయంగా తమకు హాని కలుగుతుందని భావించి, ఇలాంటి అంశాలను రాజకీయ పార్టీలు లేవనెత్తనపుడు, భారతదేశ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళుతోందని ఆయన ప్రశ్నించారు. ఖలీద్ తరఫు న్యాయవాది ఏడుసార్లు వాయిదాలు కోరారని మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఈ అంశం సుప్రీంకోర్టు ముందున్నపుడు కేవలం రెండుసార్లే వాయిదా కోరారని చెప్పారు. ”ఏండ్ల తరబడి కోర్టు తీర్పు ఇవ్వకపోతే, అందుకు లాయర్లను నిందిస్తున్నారు. ఇది కోర్టుల్లోని పరిస్థితి. మీరు బెయిల్ ఇవ్వాలనుకోకపోతే వెంటనే తిరస్కరించండి, ఎందుకు 20, 30సార్లు విచారణలు జరుపుతారు?” అని సిబల్ ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో ప్రశ్నించారు.