త్రిబుల్ ఆర్ పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఖబర్దార్
పేదోడి భూముల్లో రోడ్లు, కాలువలు
ఉన్నోళ్ల భూముల ధరలకు రెక్కలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
రీజినల్ రింగ్ రోడ్డు రైతులతో ములాఖత్లో
న్యాయం చేయాలని భూబాధితుల వేడుకోలు
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
‘రీజనల్ రింగ్ రోడ్ పేరుతో పేదల భూముల జోలికి వస్తే ఖబర్దార్. బలవం తంగా వారి భూములను లాక్కోవాలని చూస్తే సీఎం ఇంటిని ముట్టడిస్తాం’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదోడి భూముల్లో రోడ్లు, కాలువలు వేస్తే.. ఉన్నోళ్ల భూముల ధరలకు రెక్కలు వస్తు న్నాయని అన్నారు. సోమ వారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియో జకవర్గం ఫరూక్నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్డు కారణంగా భూములను కోల్పోతున్న రైతులతో జాన్వెస్లీతో పాటు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో వారు మాట్లాడారు. రైతులు తమ సమస్యలను జాన్వెస్లీతో మొరపెట్టుకున్నారు. తమకు అండగా నిలిచి, తమ తరపున ప్రభుత్వంతో పోరాడాలని కోరారు.
ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. ఎకరా, అర ఎకరా భూములతో జీవనం సాగిస్తున్న చిన్న, సన్న కారు రైతుల నుంచి రీజినల్ రింగ్ రోడ్ పేరుతో భూములను లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల భూములకు విలువలు పెంచే కార్యక్రమాలే తప్ప అభివృద్ధి ఎంత మాత్రం కాదని విమర్శించారు. 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు చేపట్టిన ప్రతిపాదనలతో పేదల బతుకులు చిద్రం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలతో ఎక్కువ శాతం నిరుపేదలే తమ భూములను కోల్పోవాల్సి వస్తుందన్నారు. పేదల భూములను బలవంతంగా తీసుకోవాలని చూస్తే…సీపీఐ(ఎం) చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు. ‘ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే ఉండాలి.. అంతేకానీ వారి జీవనోపాధికి ఆటంకం కాకూడదు’ అని సూచించారు. గతంలో చేసిన అలైన్మెంట్ ప్రకార మే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు. లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. ఇది పార్టీల సమస్య కాదని, పేదల బతుకుతెరువు సమస్య అని.. ‘మన భూ ములను మనమే కాపాడు కుందాం’ అంటూ రైతులకు పిలుపునిచ్చారు.
చావనైనా చస్తాం.. భూములను వదలం : రైతులు
‘చావనైనా చస్తాం.. కానీ భూములను మాత్రం వదులుకోం..’ అని అయ్యవారిపల్లి గ్రామ రైతులు తేల్చి చెప్పారు. ఎలాంటి సమాచారం లేకుండా రాత్రికి రాత్రే మా భూములు రీజనల్ రింగ్ రోడ్లో పోతాయని నాయకులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాన్వెస్లీతో తమ గోడును వినిపించారు. గతంలో చేసిన డిజైన్ ఆధారంగానే రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలని, ‘అలా కాదని మా భూముల గుండా రోడ్డు వేయాలని చూస్తే ఎంతటికైనా సిద్ధపడతాం.. ఎర్రజెండా చేయూతతో ఎంత దూరమైనా పయనిస్తాం…’ అని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, నాయకులు బిస సాయిబాబు, శ్రీనునా యక్, ఈశ్వర్ నాయక్, కుర్మయ్య, పద్మారెడ్డి, మహమ్మద్ బాబు, శ్రీకాంత్, కావలి రాజు, గ్రామ రైతులు సుదర్శన్రెడ్డి, వెంకటయ్య, చంద్రకాంత్, రజనీ కాంత్, ఎం సత్యం, పి సాయన్న, పూజారి సత్తయ్య, శ్రీధర్నాయక్, సూర్య నాయక్, భాస్కర్ నాయక్, శ్రీకాంత్, యాదయ్య, హరీశ్, వెంకటయ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.