నేటివిటీ సర్టిఫికెట్లకు చెల్లుచీటీ
నివాస ధ్రువీకరణను క్రమబద్ధం చేస్తాం
‘సర్’లో లక్షలాది ఓట్లు గల్లంతు : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
తిరువనంతపురం : కేరళలో శాశ్వత నివాస కార్డులు ప్రవేశపెడతామని ముఖ్య మంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా చేపట్టిన సర్ ప్రక్రియ కారణంగా ఇబ్బందులు పడుతున్న అర్హులైన ఓటర్లకు సాయం చేసేందుకు ఆయన బుధవారం పలు చర్యలు ప్రకటించారు. వాటిలో భాగంగా శాశ్వత నివాస కార్డులు ప్రవేశపెడతామని, నివాస ధ్రువీకరణను, రాష్ట్రంలో గుర్తింపును క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన సమగ్ర ఓటరు జాబితాల సవరణతో ఎన్నికల సంఘం 24,08,503 మందిని ముసాయిదా జాబితా నుంచి తొలగించిందని ఆయన విలేకరులతో అన్నారు. ‘అదనంగా 19,32,000 మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చారు. అయితే వారు తమ ఓటింగ్ హక్కులు పొందాలంటే అవసరమైన పత్రాలతో పరిశీలనకు మరోసారి హాజరు కావాల్సి ఉంటుంది.
18-40 సంవత్సరాల వయస్కులు 2002 ఎన్నికల జాబితాకు ఇప్పటికే తమ రికార్డులు అనుసంధానించారు. ఓటు హక్కును నిరూపించుకునే క్రమంలో పౌరులపై మరింత భారం పడుతోంది’ అని విజయన్ చెప్పారు. 2021 శాసనసభ, 2024 పార్లమెంటరీ ఎన్నికలలో ఓటు వేసిన వారు సహా గతంలో ఓటరు జాబితాలో పేర్లున్న అనేక మందిని ఇప్పుడు తొలగించారని విమర్శించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంద ని అన్నారు. శ్రీవరాహంలోని 138వ నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఉదహరిస్తూ అక్కడ 1,224 ఓటర్లు ఉండగా 704 మంది పేర్లు కన్పించడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని పేర్కొన్నారు. ‘అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోకుండా చూడడం కోసం ప్రభుత్వం గ్రామ కార్యాలయాలలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ అక్కడ సౌకర్యాలు లేకుంటే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించుకుంటాం. పౌరులకు సాయపడే ందుకు ప్రతి హెల్ప్ డెస్క్ వద్ద తాత్కాలికంగా ఇద్దరు అధికారులను నియమిస్తాం.
అర్హులైన ఓటర్లను గుర్తించడానికి మారుమూల, కోస్తా, వెనుకబడిన ప్రాంతాలలో బృందాలు పర్యటిస్తా యి. అవసరమైతే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా సిబ్బంది, కుటుంబశ్రీ సభ్యులను సమీకరి స్తాం. 18 సంవత్సరాల వయసు దాటిన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.’ అని విజయన్ వివరించారు. నివాస ధ్రువీకరణకు సంబంధించి ప్రస్తుతం జారీ చేస్తున్న నేటివిటీ సర్టిఫికెట్ స్థానంలో శాశ్వత, ఫొటో ఆధారిత కార్డును ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని విజయన్ అన్నారు. ‘ప్రభుత్వ సేవలు, సామాజిక కార్యక్రమాలు, ఇతర పాలనా సంబంధమైన అవసరాలకు ఈ కార్డు చట్టబద్ధమైన పత్రంగా పనిచేస్తుంది. అనేక సర్టిఫికెట్లు పొందాల్సిన అవసరం లేదు. రెవెన్యూ శాఖ బిల్లును రూపొందిస్తుంది. తహసిల్దార్లు కార్డులు జారీ చేస్తారు’ అని చెప్పారు. ఓటు వేసేందుకు పౌరులకు ఉన్న ప్రాథమిక హక్కును పరిరక్షించాల న్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నామని విజయన్ తెలిపారు.



