నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని.. రాష్ట్రంలో ఆ పార్టీ బరితెగించిందని మాజీమంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసిందదేమీ లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అయినప్పటికీ బడ్జెట్లో వృత్తి కులాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
బీసీల్లో ఎక్కువ మంది వృత్తి కులాలపై ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ అన్నారని.. ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. ముదిరాజ్లను బీసీ ఏలో చేరుస్తామని చెప్పారని.. ఇప్పటివరకు ఏమైందో తెలియదన్నారు. బీసీలకు ఆత్మ గౌరవ భవనాలకు రూ.10 వేల కోట్ల విలువైన స్థలాలు కేసీఆర్ కేటాయించారని తెలిపారు.
ఈ ప్రభుత్వంలో విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదని.. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, నిధుల ఊసే లేకుండా పోయిందని అన్నారు. బీసీలకు కనీసం నామినేటెడ్ పదవులు సైతం ఇవ్వడం లేదన్నారు. బీసీ సబ్ ప్లాన్ ఎక్కడికి పోయిందని నిలదీశారు. ప్రజలను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి రోల్ మోడల్ అని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనలు ఎవరికి కావాలని.. వీటితో బీసీలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం క్షమించదని.. భవిష్యత్తులో నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరించారు.



