– అఖిల భారత స్థాయిలో ఐక్య ఉద్యమం నిర్మిస్తాం : బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘అరావళి’ని అదానీకి దక్కనివ్వమంటూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హెచ్చరించారు. గిరిజన సంఘం అఖిల భారత కమిటీ సమావేశాలు శనివారం రాజస్థాన్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరావళి పర్వత ప్రాంతాలను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, ఆంద్రప్రదేశ్ గిరిజన ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, తెలంగాణ గిరిజన సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్తో కలిసి ఆయన ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రకృతి ఎంత కీలకమో మరింత స్పష్టంగా అవగతమైందని తెలిపారు. ఆరావళి పర్వతాలకు సుమారు 150 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటని తెలిపారు. దాదాపు 800 కిలోమీటర్ల వరకు విస్తరించి, గరిష్ఠంగా 1772 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఈ పర్వతాలు, గుజరాత్ నుంచి రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల మీదుగా విస్తరించి, థార్ ఎడారి తూర్పు దిశగా విస్తరించకుండా అడ్డుకుని కోట్లాది ప్రజల జీవనాన్ని కాపాడుతున్నాయని పేర్కొన్నారు. మానవ అభివృద్ధికి, మనుగడకు అత్యంత అవసరమైన ప్రకృతి సంపద ఈ ప్రాంతంలో విరివిగా ఉందని తెలిపారు. కార్పొరేట్ల దృష్టి ఆరావళి పర్వతాలపై పడిందనీ, అభివృద్ధి పేరుతో, ఈ పర్వత ప్రాంతాలను అదానీ ఆక్రమించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్వంసాన్ని జరగనివ్వబోమని హెచ్చరించారు. గిరిజన సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, పర్యావరణ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలను కలుపుకొని ఉదయపూర్ కేంద్రంగా అఖిల భారత స్థాయిలో జాతీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు.
‘ఆరావళి’ని అదానీకి దక్కనివ్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



