– ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలనీ, రిజిస్ట్రార్కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటీసు వాపస్ తీసుకోవాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ 1998లో ప్రారంభమైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)కి మణికొండ గ్రామంలోని 211, 212 సర్వే నెంబర్లలోని 200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. అందులో 50 ఎకరాల భూమి ఖాళీగా ఉందని 1975 రెవెన్యూ నిబంధనల్లోని నిబంధన 6 ప్రకారం ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో దీనికి వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి నోటీసు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఆ భూములను వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీకి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదనీ, అందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఆ 50 ఎకరాల భూములను యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు వినియోగిస్తామనీ, అందులో స్కూల్ ఆఫ్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్, బాలికలు, బాలుర వసతి గృహం, గ్రంథలయ భవనం, వివాహిత విద్యార్థులకు వసతి గృహం, టైప్-4, టైప్-5 క్వార్టర్స్ నిర్మించనున్నట్టు రిజిస్ట్రార్ తెలిపినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసు వెనిక్కి తీసుకోవడంగాని, భూములను స్వాధీనం చేసుకుకోబోమని స్పష్టమైన ప్రకటన చేయడం లేదని విమర్శించారు.
విద్యార్థులు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ నోరు మెదపకుండా ఉండటంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చేదాకా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేసారు. విద్యాభివృద్ధికి కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోబోమనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, కార్యదర్శి మహమ్మద్ అలీ, ఇబ్రహీం, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కుంటే సహించం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



