– దెయ్యాలకు నాయకత్వం వహించే కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు ?
– తన దగ్గరకు ఎవరూ రావడం లేదని దుఃఖపడుతున్నారు
– పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు రూ.పది వేల కోట్ల బకాయిలు
– కాంగ్రెస్ హయాంలోనే రూ.ఎనిమిది వేల కోట్ల బకాయిలు క్లియర్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– 2029 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
నవ తెలంగాణ -మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి/బల్మూరు
భావితరాలకు విద్యుత్ సమస్య రాకుండా 2029నాటికి 20 వేల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతారు? దెయ్యాలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలంలో సోమవారం విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో భట్టి ప్రసంగిస్తూ.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆయన కూతురు కవిత ఇప్పుడు చెబుతున్నారు.. కానీ ఎన్నికల ముందే రాష్ట్ర ప్రజలు ఈ దెయ్యాలను వదిలించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. వారు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రెండు దశాబ్దాలపాటు రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. తన దగ్గరకు ఇప్పుడు ఎవరూ రావడం లేదని కేసీఆర్ ద్ణుఖ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వందమంది కేసీఆర్లు అడ్డం వచ్చినా రాష్ట్ర ప్రగతి ఆగదని స్పష్టం చేశారు. కులగణనను విజయవంతంగా ఎలా పూర్తి చేశారని దేశంలోని మిగతా రాష్ట్రాల వారు అడుగుతున్నారని తెలిపారు. పదేండ్లు పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు రూ.పది వేల కోట్ల బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి వచ్చాక అందులో రూ.ఎనిమిది వేల కోట్ల బకాయిలు క్లియర్ చేశామని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మిగతా బకాయిలను దశలవారీగా పూర్తి చేస్తామని ఉద్యోగులను ఒప్పించా మని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని విమర్శించారు. తాము ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామన్నారు. 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 30వేల ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగం రాని యువత కోసం రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు.
కెేసీఆర్ మీకు దుఃఖం ఎందుకు?
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నందుకా, సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నందుకా? మీకు దుఃఖం
ఎందుకు? అని కేసీఆర్ను భట్టి విక్రమార్క ప్రశ్నించారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీని పదేండ్లలో వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తే.. అది ఆనాడు బ్యాంకు వడ్డీలకే సరిపోయిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభంలోనే ఒకేసారి రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులే కాదు భూమిలేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం రూ. 12 వేలు అందిస్తున్నామని, రైతులకు రూ. 2,000 అదనంగా పెంచి రైతు భరోసా ఇస్తుండడాన్ని చూడలేక ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్ కన్నీరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అచ్చంపేటలో రూ.12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేశామని, ఈ దేశ చరిత్రలో ఎవరూ ఇప్పటివరకు చేయలేదని వివరించారు. ధనిక రాష్ట్రాన్ని చేతికి ఇస్తే ఆనాడు 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన కేసీఆర్్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ తరాలకు మిగులు విద్యుత్ అందిస్తామని, ఇతర రాష్ట్రాలకు విద్యుత్ను అమ్మే స్థాయికి ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ ప్రాజెక్టు జీవో ఇచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గంలో 45వేల పంపుసెట్లకు సోలార్ పవర్ ఏర్పాటు చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జి.మధుసూదన్రెడ్డి, తుడి మేఘారెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మెన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.