టీ-ఫైబర్ ఉద్యోగి పిల్లలకు మంత్రి శ్రీధర్బాబు భరోసా
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అనారోగ్యంతో మరణించిన టీ- ఫైబర్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ బుర్రా నాగరాజారావు ఇటీవల మరణించారు. ఆయన భార్య గత ఏడాదిజూన్లో మరణించారు. దీనితో వారి ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారు. వారిద్దరినీ హుజూరాబాద్లో ఉండే అమ్మమ్మ వెంకటలక్ష్మి పోషిస్తున్నారు. విషయం తెలిసిన ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం నాగరాజారావు కుమార్తె సుప్రీతి (14)ని సచివాలయానికి పిలిపించారు.
ఆమె పేరుతో రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేసారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ధైర్యం చెప్పారు. ఎప్పుడు ఏ సహాయం అవసరమైనా తన కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. నాగరాజా రావు కుమారుడు సంప్రీత్ ఇంటర్ చదువుతుండగా, కుమార్తె సుప్రీతి 9 వ తరగతి చదువుతున్నారు. కార్యక్రమంలో టీ-ఫైబర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పన్నేరు వేణుప్రసాద్ పాల్గొన్నారు.



