గోదావరి ట్రిబ్యూనల్ నిబంధనలను ఉల్లంఘించిన ఏపీ
అనుమతులివ్వరాదని వివిధ కేంద్ర విభాగాలకు లేఖలు
హరీశ్రావు లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు
ఈనెల 12న సుప్రీంకు స్వయంగా హాజరవుతా : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ను అడ్డుకుంటా మని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)1980 అవార్డ్తో పాటు అంతరాష్ట్ర జల నిబంధనలను ఉల్లంఘించడ మేనని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గత సమాచారం కోసం పంపినది మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సష్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొట్టి పారేశారు. పోలవరం-నల్లమల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీతో పాటు కేంద్ర జలసంఘం, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోపైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని పేర్కొన్నారు. డిసెంబర్ 4న కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్విని నియమించిందని తెలిపారు. సోమవారం జరగాల్సిన వాయిదాలు వచ్చే సోమవారానికి (జనవరి 12) వాయిదా పడ్డాయనీ, రిట్ పిటిషన్ను సూట్ పిటిషన్గా మార్చి దాఖలు చేయాలని కోర్టు సూచించినట్టు తెలిపారు. వచ్చే సోమవారం జరగనున్న వాదనలకు స్వయంగా తానే హాజరై మళ్ళీ స్టే ఆర్డర్ కోరతానని మంత్రి వివరించారు. ఈ విషయంపై రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలువరించ డంలో విజయం సాధించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణా సమాజం గుర్తుంచుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారని మంత్రి మండిపడ్డారు. వారి పాలనలో మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి, తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రీ-డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు తెలంగాణా భవిష్యత్ తరాల మీద మోయలేని భారాన్ని గత ప్రభుత్వం మోపిందని విమర్శించారు. తమపై ఎవరెన్ని విమర్శలు చేసినా రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి వాటాలను సాధించి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
‘పోలవరం-నల్లమల’ను అడ్డుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



