Thursday, June 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబనకచర్లను అడ్డుకుంటాం

బనకచర్లను అడ్డుకుంటాం

- Advertisement -

30న ప్రజాభవన్‌లో పీపీటీ
బ్యారేజీల పునరుద్ధరణకు
కన్సల్టెంట్‌గా ఎన్డీఎస్‌ఏ
సత్వరమే సాగర్‌లో పూడికతీత
ఆధునిక సాంకేతికతతో ఎస్‌ఎల్‌బీసీ పనులు
నీటిపారుదల శాఖకు ఇద్దరు సైనికాధికారులు
పదోన్నతులు, బదిలీలకు గ్రీన్‌ సిగల్‌ : సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో బలమైన వాదనలు వినిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలువరిస్తామన్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌ కాలనీలోని నీటిపారుదల శాఖ కేంద్ర కార్యాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఈఎన్సీ మహమ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నీటిపారుదలశాఖలోకి సైనికాధికారులు
టన్నెల్‌ నిర్మాణాలలో అపారమైన అనుభవం కలిగిన ప్రముఖ సైనికాధికారులిద్దరిని నీటిపారుదల శాఖలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. ఇటీవల రోహ్తంగ్‌, జోజిలా టన్నెల్‌ నిర్మాణంలో పనిచేసిన ఇద్దరు అధికారులను వినియోగించుకునేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తున్నదన్నారు. భారత సైన్యంలో ఇంజినీర్‌ ఇన్‌-చీఫ్‌గా పనిచేసిన జనరల్‌ హార్బల్‌ సింగ్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహా దారుడిగా నియమించనున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన టన్నెల్‌ టెక్నాలజీ నిపుణులు కర్నల్‌ పరిక్షిత్‌ మోహ్రా జులైలో రాష్ట్ర నీటిపారుదల శాఖలో చేరనున్నారని తెలిపారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై సమీక్షించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరణ పనులకై ఎన్డీఎస్‌ఏ డిజైన్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుందన్నారు. పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రతివారం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదికను సమర్పించాలన్నారు. కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలనీ, డిండి ప్రాజెక్ట్‌ భూసేకరణ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని అన్నారు.
ఆధునికంగా ఎస్‌ఎల్‌బీసీ పనులు
శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ)పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి, పునరుద్ధరణ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామన్నారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామనీ, పనులను వేగవంతం చేసేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకు పోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నీటిపారుదల శాఖలో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలనీ, అనంతరం బదిలీల తంతును వెంటనే చేపట్టాలని సూచించారు. ప్రధాన ప్రాజెక్టులలో పూడికతీత పనులపై ఆయన స్పందిస్తూ అనేక జలాశయాలు పూడికతో నిండినందున 20 నుంచి 25 శాతం మేర నీటిసామర్ధ్యం తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌ తదితర ప్రాజెక్టుల పూడిక తీత పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా నాగార్జునసాగర్‌ పూడికతీత పనులను సత్వరం ప్రారంభించాలన్నారు.
ఈవిషయమై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సమాచారం అందించాలని అధికారులను సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజీలను రూపొందించే అంశాలపై అధికారులు దష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.
‘సీఆర్‌ పాటిల్‌కు చెప్పాం’
గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణకు సంభవించనున్న ముప్పును సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఈ నెల 19న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు సవివరంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ఫిజిబిలిటీ నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని కోరామన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ నీటి కేటాయింపులపై ప్రభావం పడుతుందనీ, దానిని దష్టిలో పెట్టుకుని నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి పాటిల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించలేదనీ, త్వరలోనే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి వివరించారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు జరిగే నష్టంపై ఈ నెల 30న ప్రజాభవన్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -