నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ సంఘాల నాయకుల ద్వారా వారి తెలియజేసిన సలహాలు, సూచనలను స్వీకరించారు.
ఈ సమావేశానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఒక పండుగ వాతావరణంలో జిల్లాలో ఏప్రిల్ 5 న బాబు జగ్ జీవన్ రామ్ జయంతి ,ఏప్రిల్ -11న జ్యోతిబా పూలే , మరియు ఏప్రిల్ -14 డా,,బి. ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున వివిధ శాఖల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అందరి సహకారంతో సామరస్యంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు. అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య చర్యలు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల బేధం లేకుండా అన్ని కులాల నాయకులు ఈ ఉత్సవాల్లో పాల్గొని విజయంతం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అధికారి సాహితీ, భువనగిరి డీఎస్పీ రవీందర్,ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి,ఈ.డి ఎస్సీ కార్పొరేషన్ శ్యాం సుందర్, వివిధ సంఘాల నాయకులు , ఎస్సీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



