– ఐద్వా జాతీయ మహాసభల విజయవంతంలో కీలకభూమిక
– 450 మందికిపైగా విశేష సేవలు
– నిత్యం ప్రతినిధులకు అందుబాటులో…
– ఎక్కడా లోటుపాట్లు రాకుండా జాగ్రత్తలు
– రవాణా, వసతి మొదలుకుని భోజనాల వరకు సేవలు అద్వితీయం
నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘ఇందుగలడందు లేడని… సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసినా అందందే గలడు దానవాగ్రణి వింటే’ అన్నట్టుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ 14వ మహాసభలు విజయవంతంలో ఎక్కడ చూసినా వాలంటీర్ల పాత్రే విశేషంగా కనిపిస్తున్నది. నిత్యం ఆహ్వాన సంఘం, ఐద్వా నాయకులు, ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ఎక్కడా లోటుపాటు రాకుండా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమయానుకూలంగా సమన్వయంతో పనిచేస్తూ అందరి నోట శభాష్… వాలంటీర్ అని అనిపించుకుంటున్నారు. రవాణా, వసతి, అలంకరణ, భోజనాలు వంటి సేవల్లో వాలంటీర్ల పాత్ర అమోఘం, అద్వితీయం. ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయడంలో 450 మందికిపైగా వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. మహాసభలు జయప్రదం కావడంలో 22 కమిటీలకు చెందిన నాయకులు, వాలంటీర్లు కృషి చేశారు.
భిన్న సంస్కృతుల ప్రతినిధులకు వంటకాలు
ఐద్వా జాతీయ మహాసభలకు 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 800 మందిక ిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. వివిధ రకాల సంస్కృతి, జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఉంటా యి. అందుకనుగు ణంగా ఆహ్వానసంఘం భోజ నాలను అందించాలి. గిరిజన సంస్కృతి కలిగిన ప్రతి నిధులు కూడా వచ్చారు. ఇందు కోసం చాలా రకాల వంటకాలు అవసరమ వుతాయి. అయితే ఆహ్వాన సంఘం వాటిని వండించి పెట్టడం ప్రతి నిధులను ఆకట్టుకుంటున్నది. అందరికీ ఎప్పుడూ మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచారు. ఉత్తర భారతం, దక్షిణ భారతదేశ ప్రతినిధులను దృష్టిలో ఉంచుకుని వంటలు తయారు చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, టీ, స్నాక్స్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్, రాత్రి భోజనం ఇలా సకాలంలో సమయానుకూలంగా వంటలను తయారు చేసి వడ్డిస్తున్నారు. భోజనం ఏర్పాట్లు, వడ్డించడం కోసమే వంద వాలంటీర్లు పనిచేస్తున్నారు. టి సాగర్, టి స్కైలాబ్బాబు, ధర్మానాయక్ నేతృత్వంలోని వాలంటీర్లు ప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ భోజనం వడ్డిస్తూ ప్రశంసలు పొందుతున్నారు.
సమన్వయంతో రవాణా ఏర్పాట్లు
మహాసభలకు హాజరవుతున్న ప్రతినిధులకు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో బస ఏర్పాటు చేశారు. వారందర్నీ సమయానికి మహాసభల వేదిక వద్దకు తీసుకురావడం, అవి ముగిశాక మళ్లీ తిరిగి వారిని విడిదికి తీసుకెళ్లడంలో రవాణా బాధ్యతలు చూస్తున్న వాలంటీర్ల సేవలు అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి విసుగు, విరామం లేకుండా అన్ని ఏర్పాట్లు క్రమశిక్షణతో చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మినీ బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఏదైనా ఆలస్యం జరిగితే, ఓపిగ్గా వేచిఉండి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాసభల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫోర్ట్ కమిటీ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి శ్రీకాంత్, వీఎస్ రావు, ఎం శ్రీనివాస్, అజరుబాబు, కోటయ్య, జేకే శ్రీనివాస్, కె రవీందర్రెడ్డి, శ్రీరాములు నిర్వహిస్తున్నారు. నగరంలోని 18 హోటళ్లలో ప్రతినిధులకు బస ఏర్పాటు చేశారు. వీటిని తొమ్మిది జోన్లుగా విభజించి 25 బస్సులు, 8 కార్లను వారి రాక పోకలకు ఏర్పాటు చేశారు. వారికి సహాయ కులుగా 32 మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరి సేవల్ని దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి సమన్వయంతో రవాణా ఏర్పాట్లు చేశారని కొనియాడుతున్నారు.
రిజర్వేషన్, రిసెప్షన్ పనిలో నిమగం
రిజర్వేషన్, రిసెప్షన్ పనిలోనూ వాలంటీర్లు నిమగ మయ్యారు. ఎయిర్పోర్టు నుంచి 160 మంది, రైల్వే స్టేషన్ల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులను తీసుకొచ్చారు. ఉడుత రవీందర్, ఆనగంటి వెంకటేశ్, కోట రమేష్, అశోక్రెడ్డి బాధ్యులుగా ఉండి పనిచేశారు. ఫొటో ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్తోపాటు అంబేద్కర్ నాటిక, కళాకారులకు వాలంటీర్లు సహాయం చేశారు. ఈనెల 25న ఐద్వా మహాసభల ప్రారంభసభ, బహిరంగసభ, మహిళా ప్రదర్శన విజ యవంతం కావడంలో వారు విశేషంగా కృషి చేశారు. క్రమశిక్షణతో పనిచేశారు. ఎండీ అబ్బాస్, ఆశయ్య, మూడ్ శోభన్ సారధ్యంలో అలంకరణ పెద్దఎత్తున చేశారు. గోడలపై రాతలు రాశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యా లయం (హెచ్సీయూ) విద్యా ర్థులు కూడా సామాజిక స్పృహతో వాలంటీర్లుగా పనిచేశారు. విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, సామాజిక సంఘాలు, వర్గ సంఘాలకు చెంది న వాలంటీర్లు స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. మీడియా, సోషల్ మీడియా కూడా మహాసభలను విజయవంతం చేయడంలో కృషి చేసింది.
వేదిక వద్ద మహిళా ఉపాధ్యాయుల సేవలు
ఐద్వా మహాసభల ప్రాంగణంలోని వేదిక, హాల్లో టీఎస్యూటీఎఫ్నకు సంబంధించిన మహిళా ఉపాధ్యాయులు వాలంటీర్లుగా సేవలందించారు. శాంతికుమారి, దుర్గాభవాని, జ్ఞానమంజరి, విశాలి నేతృత్వంలో వేదిక మీద ఉన్న నాయకులకు, హాల్లోని ప్రతినిధులకు నిత్యం అందుబాటులో ఉన్నారు. సమయానికి నీళ్లు, టీ, స్నాక్స్ అందించారు.
వాలంటీర్లు బాగా కష్టపడుతున్నారు : జూలకంటి
ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేసేందుకు వాలంటీర్లు బాగా కష్టపడి పనిచేస్తున్నారని ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ప్రతినిధులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మహాసభ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అదే స్ఫూర్తితో పనిచేస్తు న్నారని వివరించారు. ప్రతినిధులకు మహిళా వాలంటీర్లు, ఇతరులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారని చెప్పారు.
మహాసభ జయప్రదంలో వాలంటీర్ల పాత్ర కీలకం : ఆర్ వెంకట్రాములు
ఐద్వా జాతీయ మహాసభలు జయప్రదంగా సాగుతున్నాయనీ, ఇందులో వాలంటీర్ల పాత్ర కీలకంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు అన్నారు. రానున్న కాలంలోనూ సామాజిక స్పృహతో ఎలాంటి మహాసభలనైనా విజయవంతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. 450 మందికిపైగా వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు ప్రకటించారు. రానున్న కాలంలో మరింత ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.



