లెఫ్ట్ ఫ్రంట్ రెండో జాబితా
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం లెఫ్ట్ఫ్రంట్ గురువారం 32 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 28 మంది సిపిఎం అభ్యర్థులు ఉన్నారు. సిపిఐ నుంచి ముగ్గురు, ఆర్ఎస్పి నుంచి ఒక్క అభ్యర్థి ఉన్నారు. రెండో జాబితాను సిపిఎం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్లో జరిగిన ఓటర్ల జాబితాల ఎస్ఐఆర్ ప్రక్రియపై జరుగుతున్న జ్యూడిషియల్ విచారణను ‘ప్రాథమిక విజయం’గా అభివర్ణించారు.
బెంగాల్ అసెంబ్లీ రెండు దశల ఎన్నికల కన్నా ముందుగానే అర్హులైన ప్రతీ ఓటరు పేరూ జాబితాలో నమోదయ్యే వరకూ వామపక్ష నాయకులు విశ్రమించరని సలీం స్పష్టం చేశారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో జాబితాలో అఫ్రీన్ బేగం (బల్లీగంజ్ అసెంబ్లీ స్థానం), మణిరుల్ ఇస్లాం (మెటియాబ్రూజ్), హిమంశు గిరి (ఖేజురి), సమరేంద్ర నాథ్ నైయా (నంది గ్రామ్) వంటి ప్రముఖ సిపిఎం నాయకులు ఉన్నారు. మూడు రోజుల క్రితం 192 మంది అభ్యర్థులతో లెఫ్ట్ ఫ్రంట్ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -



