– రేపటి మంత్రివర్గ సమావేశంపై సామాన్యుల్లో ఆసక్తి
– సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల ఎదురుచూపు
– పెండింగ్ డిఏలు..బిల్లుల కోసం నిరీక్షణ
– పీఆర్సీ నివేదికపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్
– మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించిన అధికారుల కమిటీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటి వరకూ ఆరు గ్యారెంటీలపైనే ప్రధానంగా చర్చ కొనసాగింది. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు.. నన్ను కోసినా ఇంతకంటే ఏం చేయలేను.. పాలనంటే నల్లేరు మీద నడకకాదు…’ అంటూ సీఎం రేవంత్రెడ్డి పలు వేదికలపై ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకొనే నిర్ణయాలపై రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిని కనబరుస్తుంది.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరు గ్యారెంటీల్లో మరో మూడు గ్యారెంటీలు ఇంకా అమ ల్లోకే రాలేదు. సర్కారు గల్లాపెట్టె నిండకపోవడమే దీనికి ప్రధా న కారణం. బీఆర్ఎస్ సర్కారు హయాంలో పేరుకుపోయిన అనేక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపి కబురు అందలేదు. గల్లాపెట్టె నిండలేదు కాబట్టి నేనేం చేయలేను అంటే ప్రజలు సర్దుకుపోయే పరిస్థి తులూ కనిపించట్లేదు. రాజీవ్ యువవికాసం స్కీంకు సంబం ధించి జూన్ 2న ఇస్తామన్న రుణ మంజూరీ పత్రాలు వాయిదా పడ్డాయి. సమీక్షల పేరుతో సర్కారు ఎంత హడావిడి చేసినా, లక్షల్లో వచ్చిపడిన దరఖాస్తుల్ని చూసి, డబ్బుల్లేవు అని చేతులె త్తేసే పరిస్థితి ఏర్పడింది. నేరుగా ఆ మాట చెప్పలేక… ‘దరఖాస్తుల సంపూర్ణ పరిశీలన’ అనే కారణాన్ని చెప్పుకొచ్చారు. ‘ధరణి’ స్థానంలో వచ్చిన భూ భారతి చట్టంపై రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. తహసీల్దారుతో పాటు రెవెన్యూ యంత్రాంగమే స్వయంగా గ్రామాలకు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు. కార్డులు ఎప్పుడిస్తారనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. వాటికోసమూ ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. మోడల్ హౌస్ల పేరుతో గ్రామాల్లో అక్కడక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. లబ్దిదారులందరికీ ఒకే దఫాగా ఇండ్ల నిర్మా ణం కొనసాగట్లేదు. ఇప్పటికే అర్హులైనవారిలో చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదనే ఆరోపణలు గ్రామసభల్లో వినిపిం చాయి. దీనిపైనా సర్కారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తికావచ్చినా, రైతుల ఖాతాల్లో ఇంకా పూర్తిగా సొమ్ము జమకాలేదు. మరోవైపు వానాకాలం సాగుకు రాష్ట్ర రైతాంగం సన్నద్ధమవుతోంది. నాట్లకు ముందే రైతుభరోసాను ఖాతాల్లో వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వీటన్నింటిపై గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు సామాన్య ప్రజలు కూడా మంత్రివర్గ నిర్ణయాలకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఉద్యోగుల ఎదురుచూపులు
రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. బీఆర్ఎస్ హయాం నుంచి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఒక కారణం. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ వారు కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ అనేక హామీలిచ్చింది. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలివ్వడం మినహా మిగతా సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైనా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నది. ఉద్యోగ సంఘాలన్నీ రెండు జేఏసీలుగా ఏర్పడ్డాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనీ, ఉద్యమాలకు సిద్ధం కావాలని ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్యోగులు కోరుతున్నారు. అందులో భాగంగా ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలో అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఉద్యోగ సంఘాలతో నవీన్ మిట్టల్ కమిటీ పలుమార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. అనంతరం నివేదికను రూపొందించి గతనెల 29న మంత్రివర్గ ఉప సంఘం చైర్మెన్ భట్టి విక్రమార్కకు అప్పగించారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావు ప్రకటించారు.
దీంతో ఉద్యోగుల ఆశలన్నీ మంత్రివర్గ సమావేశంపైనే ఉన్నాయి. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారంపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. కానీ కనీస ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలోనైనా ఉద్యోగుల సమస్యలు చర్చించి పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటారా?లేదా? అనే ఆందోళన ఉద్యోగుల్లో ఉన్నది.
ఇవీ సమస్యలు
ఉద్యోగ జేఏసీ 57డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. వాటిలో ఆర్థికేతర సమస్యలు 47, ఆర్థిక పరమైనవి 10 ఉన్నాయి. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో కనీసం రెండు డీఏలనైనా విడుదల చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు సుమారు రూ.పది వేల కోట్లు ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని కోరుతున్నారు. రెండో పీఆర్సీ 2023, జులై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలి. ఇప్పటికే రెండేండ్లు అవుతున్నది. వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ను అమలు చేయాలన్న డిమాండ్ ఉన్నది. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మెన్గా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రంలో స్పౌజ్ (భార్యాభర్తలు), మ్యూచువల్ (పరస్పర), హెల్త్ (ఆరోగ్యం) కారణాలున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది. అయితే స్థానికత కోల్పోయిన ఉద్యోగులు ఇంకా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. వారికి న్యాయం చేయాలని ఉద్యోగ జేఏసీ కోరుతున్నది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)ను పటిష్టంగా అమలు చేయాలన్న డిమాండ్ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇలా అనేక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. గురువారం సమావేశమయ్యే మంత్రివర్గం ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని చూపుతుందో, ఎలా పరిష్కరిస్తుందో వేచిచూడాల్సిందే.
మా సంగతేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES