– జాబ్ క్యాలెండర్ అమలును మరిచిన ప్రభుత్వం
– ఎస్సీ వర్గీకరణ పూర్తయినా విడుదల కాని నోటిఫికేషన్లు
– ఆటంకాల్లేకున్నా ఆగిపోయిన వైనం
– మంత్రివర్గ సమావేశంలోనూ ఉద్యోగాల చర్చే లేదు
– ఆందోళనలో నిరుద్యోగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల భర్తీ ప్రక్రియను మరిచిపోయినట్టుగా ఉన్నది. జాబ్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా గతేడాది ఆగస్టు రెండున ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి కావడంతో ఆటంకాలన్నీ తొలగిపోయాయి. కానీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల కావడం లేదు. ఎస్సీ వర్గీకరణ అమలుకు అనుకూలంగా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. అందులో భాగంగా గతేడాది అక్టోబర్ 12న ఎస్సీ వర్గీకరణను అధ్యయనం చేసేందుకు జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. మూడు కేటగిరీలుగా ఎస్సీలను విభజించింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3లుగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసింది. గ్రూప్-1లో 3.2888 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన 15 కులాల వారికి ఒక శాతం, గ్రూప్-2లో 62.74 శాతం ఉన్న 18 కులాల వారికి తొమ్మిది శాతం, గ్రూప్-3లో 33.963 శాతం ఉన్న 26 కులాల వారికి ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ ఉండాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14 వరకు ఎస్సీ వర్గీకరణ పూర్తి కానందున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి ఆటంకం లేకున్నా నోటిఫికేషన్లు విడుదల కావడం లేదు. ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన చర్చే జరగడం లేదు. ఎప్పుడు విడుదల అవుతాయో స్పష్టత లేదు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మాటతప్పిన ప్రభుత్వం
‘అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.’అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2023 డిసెంబర్ ఏడున రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇస్తామన్న కొలువులు రెండు లక్షలు… ఏడాది పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 54,520 మాత్రమే. ఇంకా 1,45,480 కొలువులను ఇవ్వాల్సి ఉన్నది. మొదటి ఏడాదిలో రెండు లక్షల కొలువులు ఇవ్వకుండా మాటతప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోలేదన్న అభిప్రాయం నిరుద్యోగ యువతలో వినిపిస్తున్నది. రాజీవ్ యువ వికాసం అందకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాకపోవడం, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
యువ వికాసం లేదు..ఉద్యోగాల్లేవు
ఈనెల రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరుద్యోగుల సమస్యల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, కొలువుల ప్రకటన గురించి ప్రస్తావిస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ నిరాశే ఎదురైంది. ఈనెల ఐదో తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించారు. మంత్రివర్గంలోనూ నిరుద్యోగుల గురించి చర్చించకపోవడం గమనార్హం. ఇంకోవైపు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈనెల రెండో తేదీన లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తామని వెల్లడించింది. తీరా ఈనెల రెండున దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఒకవైపు రాజీవ్ యువ వికాసం లేక, ఇంకోవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.