చేతనైతే పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదించాలి : బీజేపీ నేతలకు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి సవాల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఇంతకన్న బెస్ట్ ఏముందో చెప్పాలంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ముదిరాజ్ బీజేపీ జాతీయ నాయకులను ప్రశ్నించారు. చేతనైతే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న ఆ బిల్లుకు ఆమోదం తెలపాలని సవాల్ విసిరారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ నేతలకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ది ఉంటే ఆ బిల్లుకు మద్దతు తెలుపాలని కోరారు. బీజేపీ అధ్యక్షులు రామచందర్రావు సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడం సరైందికాదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నదనీ, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి తాను అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కలవబోతున్నట్టు తెలిపారు. తమిళనాడులో 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. బీసీలకు దసరా పండుగ కంటే ముందుగానే పండుగ వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని ప్రయత్నాలు చేశామనీ, ఇప్పుడు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు.