ఒక్కోసారి మనసు కలత చెందుతుంది. మరీ ముఖ్యంగా మనం ప్రాణంగా భావించేవారికి దూరమవుతుంటే మనసు పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ బాధను మనసులో దాచుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక మనో వేధన అనుభవిస్తుంటారు చాలా మంది. అలాగని ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం మన ఆరోగ్యంపైనే కాదు ఇతర అనుబంధాల పైనా పడుతుంది. అందుకే ఈ మనోవేదన నుంచి వీలైనంత త్వరగా బయటపడడం చాలా ముఖ్యం.
ఇలాంటప్పుడే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్తపడాలి’ అంటారు పెద్దలు. కానీ చాలా మంది సమస్య వచ్చినపుడు చూసుకుందాంలే అనుకుంటారు. మరికొందరు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా వస్తుంది. ఇలా విడిపోయినా, తాము చేసిన పొరపాట్ల విషయంలో మాత్రం అస్సలు రియలైజ్ కారు. తప్పంతా అవతలి వారిదేనంటూ వారిని నిందిస్తూ మానసికంగా కుంగిపోతుంటారు. దీని వల్ల ఫలితం ఉండకపోగా మనోవేదన రెట్టింపవుతుంది. ఇలా జరగకూడదంటే అవతలి వారిని నిందించడం మాని తాము చేసిన పొరపాట్లేంటో గుర్తించాలి. దీనివల్ల కోపతాపాలను తగ్గుతాయి. మనసులోని బాధ కూడా క్రమంగా తగ్గుతుంది. ఒకవేళ పొరపాటు అవతలి వారిదే అయినా వారు మీ నుంచి విడిపోయాక వారిపై కోపం ప్రదర్శించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకుంటే ప్రతికూల ఆలోచనల్లో నుంచి బయటపడి మానసిక సాంత్వన పొందవచ్చు.
అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నా వారి ఆలోచనలు నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఈ బాధను మనసులో దాచుకోవడం వల్లే చాలా మంది ప్రశాంతతను కోల్పోతుంటారు. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకో లేదంటే తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనో ఒంటరిగానైనా బాధను భరిస్తారు కానీ ఇతరులతో పంచుకోరు. కానీ కష్టమో, నష్టమో అన్న సంగతి పక్కన పెట్టి మనసలోని బాధను, మీ ఆలోచనల్ని మీ మనసుకు దగ్గరగా ఉన్న వారితో పంచుకుంటే… కొండంత భారం దిగిన భావన కలుగుతుంది. తద్వారా వారు మీకు తగిన సలహాలు సూచించే అవకాశమూ వుంటుంది.
మనసు ప్రతికూల ఆలోచనలు, బాధతో నిండిపోయినప్పుడు దేనిపైనా ఆసక్తి చూపలేం. కానీ ఈ సమయంలో కొన్ని అంశాలపై దృష్టి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. వీటిలో డైరీ రాయడం ఒకటి. ఆ క్షణం మీ మనసులో మెదిలిన ఆలోచనల్ని కాగితంపై పెట్టడంతో పాటు వాటిని ఓసారి పున:శ్చరణ చేసుకోండి. అంటే.. ఇది ఒక రకంగా మీ బాధను మీతోనే పంచుకోవడమన్న మాట. దీని వల్ల స్వయంగా రియలైజ్ అయి మనసులోని ప్రతికూల ఆలోచనలు క్రమంగా దూరమవుతాయి. ఇలా రోజూ ఓ పావుగంట పాటు డైరీ రాయడం వల్ల యాంగ్జైంటీ, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు దూరమవుతాయని ఓ అధ్యయనంలో తేలింది. కనుక మానసిక ఆలోచనల్ని అదుపు చేసుకోవాలంటే ఇది చక్కటి పరిష్కార మార్గం. అలాగే మీకంటూ కొన్ని హద్దులు పెట్టుకోండి. మిమ్మల్ని బాధ పెట్టే విషయాలను కాలానుగుణంగా మర్చిపోండి. దీనివల్ల మనసులోని బాధలన్నీ దూరమవుతాయి. మీలో కొత్త ఉత్సాహం జనిస్తుంది. ఇదే మిమ్మల్ని సానుకూలంగా ముందుకు నడిపిస్తుంది.
కలత చెందితే..?
- Advertisement -
- Advertisement -