Friday, May 30, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఏం జరగబోతోంది?

ఏం జరగబోతోంది?

- Advertisement -

– కొత్త పార్టీయా? లేక బీజేపీలోకా?
– కవిత నిర్ణయంపై సర్వత్రా చర్చ
– ఇతర రాష్ట్రాల్లోని పరిణామాలను గుర్తు చేస్తున్న విశ్లేషకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గత నెలలో అంగరంగ వైభవంగా రజతోత్సవాలను నిర్వహించుకున్న బీఆర్‌ఎస్‌… ఇప్పుడు పలు కుదుపులకు లోనవుతోంది. గత వారం రోజులుగా కొనసాగుతున్న పరిణామాలతో ‘అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది…?’ అనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సందట్లో సడేమియాగా కొన్ని పత్రికలు కేసీఆర్‌ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధికార కాంగ్రెస్‌లోకి వెళుతోందంటూ కథనాలు వెలువరించే సరికి… ఆమె సీరియస్‌ అయ్యారు. ‘ఇది జర్నలిజమా? లేక శాడిజమా…?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబో తున్నారనే ఊహాగానాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే గతంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ విషయంలో చేసిన కామెంట్లను ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. ‘ప్రతోడు పార్టీ పెడతానంటున్నాడు, పార్టీ పెట్టటమంటే, పాన్‌ డబ్బా పెట్టినంత ఈజీ కాదు…’ అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కవిత విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని విశ్లేషకుల వాదన. అధికార కాంగ్రెస్‌, ఆ తర్వాత బీఆర్‌ఎస్‌, బీజేపీలు రాష్ట్రంలో ప్రధాన పాలక పార్టీలుగా ఉన్నాయి. వీటిని కాదని మూడో పార్టీ పెడితే, అది మనుగడ సాధించటం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం, దేవేందర్‌గౌడ్‌ నవతెలంగాణ ప్రజా పార్టీ, ఇటీవల వైఎస్‌ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ టీపీ తదితర పార్టీలు, కొద్ది నెలల్లోనే అంతర్థానమైన ఉదంతాలను వారు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు సీబీఐ, ఈడీ కేసులు, జైళ్లు, వాటి ఆధారంగా ఇతర పార్టీల నేతలను బీజేపీ లొంగదీసుకోవటానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్న అనేక పరిణామాలను విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. తద్వారా వివిధ పార్టీల నేతల కుటుంబాల్లో చిచ్చుపెట్టి, ఆయా కుటుంబ సభ్యులను, పార్టీలను చీల్చి, బీజేపీలో చేర్చుకోవటం లేదా విలీనం చేసుకోవటం లాంటి ఘటనలను వారు ప్రస్తావిస్తున్నారు. జార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ వదిన, ఎమ్మెల్యే అయిన సీతా సోరెన్‌పై కేసులు నమోదు చేయటంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు, ఆయన అన్న కొడుకు అజిత్‌ పవార్‌కు మధ్య బీజేపీ వివాదాన్ని సృష్టించింది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌కు, ఆయన బాబారు శివపాల్‌ యాదవ్‌కు ఆ పార్టీ తగవులు సృష్టించింది. బీహార్‌లో రాంవిలాస్‌ పాశ్వాన్‌ అనంతరం, అతడి తమ్ముడు పరాశ్‌ పాశ్వాన్‌ను బీజేపీ దగ్గరకు తీసింది. ఇప్పుడు అతడి కొడుక్కి పెద్దపీట వేసి, పరాశ్‌ను బయటకు పంపింది. హర్యానాలో ఓం ప్రకాశ్‌ చౌతాలాను పలు కేసుల్లో ఇరికించి, ఆయన మనవడు దుశ్యంత్‌ చౌతాలాకు పెద్ద పీట వేసింది. ఇదే తరహాలో ఇప్పుడు బీహార్‌లో ఆర్జేడీ బహిష్కరించిన తేజస్వి ప్రతాప్‌ యాదవ్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇలాంటి ప్రయోగాన్ని బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ప్రయోగించనుందా? అనే గుసగుసలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ఏ దారిని ఎంచుకోనుందనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఆమె పార్టీ పేరు, జెండా, గుర్తు కూడా ఖరారయ్యాయని వినికిడి. అన్నీ కుదిరితే జూన్‌ 9న పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని ఆమె సన్నిహితులు కొందరు చెబుతున్నారు. అయితే వీటిలో ఏది నిజమో? ఏది కాదో? తేలాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -