రైతు లేనిదే రాజ్యం లేదు, అన్నదాతే దేశానికి వెన్నెముక. జై కిసాన్ అంటూ ఉపన్యాసాన్ని దంచికొట్టే పాలకుల తీరును చూస్తే ‘మాటలు కోటలు దాటుతున్నాయి-చేతలే తంగేళ్లు దాటడం లేదు” అన్నట్టుగా ఉంది. నిజానికి రైతు శ్రమకు తగ్గ గుర్తింపు,గౌరవం ఇస్తు న్నామా?ఒక్కసారి పరిశీలిం చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. కారణం, పాలకుల చేతగానితనం, నిర్లక్ష్యపు వైఖరి. అదేస్థాయిలో పారిశ్రామిక, సాంకేతిక, సేవారంగాలు వేగంగా అభివృద్ధి చెందుతు న్నాయి. ఎందుకు? ఇందులో పెట్టుబడి దారుల ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి. జాతీయ స్థూల విలువ జోడింపు (జీఏవి)లో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా బాగా తగ్గుతోంది. కృత్రిమ మేధ (ఏఐ)అన్ని రంగాల్లోనూ ప్రవేశించి ప్రగతి పరుగులు పెట్టిస్తుంటే వ్యవసాయ రంగం మాత్రం ”ఎక్కడ వేసిన గొంగళి అక్కడే”అన్న చందంగా కునారిల్లుతోంది. రైతు ఆత్మహత్యలను ఆపలేక పోవడం పాలకుల తీవ్రమైన వైఫల్యం. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్న సాగును బాగుచేయడం పక్కనపెడితే, కనీసం ఆత్మ హత్యలనైనా నివారించాలి కదా! ప్రభుత్వం పెట్టిన పథకాలను నమ్ముకుని చాలామంది వ్యవసాయం వైపు మరిలారు. కానీ ఇక్కడ పెట్టుబడి రెండింత లైతే దిగుబడి అంతకన్నా తక్కువగా ఉంటున్నది. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా వెన్నంటే ఉండాల్సిన ప్రభుత్వం పత్తకు కూడా లేదన్నది వాస్తవం. దీనికితోడు వ్యవసాయంపై పర్యవేక్షణ కూడా రోజురోజూకూ కొరవడుతోంది.
ఈ సంవత్సరం వర్షాలు జోరుగా కురుస్తాయని, రుతుపవనాలు ముందే వస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.అలానే జూన్ మొదట్లో తొలకరి మురిపించింది.ఆ తర్వాత జూన్ నెలాఖరు వస్తున్నా ఆకాశం మేఘావృతమై ఉంటుందే కానీ వర్షాలు పడటం లేదు.తొలకరి వానలకు నాటిన పత్తి తదితర పంటల కోసం రైతులు నొసటిన చేయి పెట్టి ఆకాశం వైపు ఎదురుచూస్తున్న పరిస్థితి ఇన్నేండ్లయినా మారలేదు. అన్నదాతలకు ఎంతో ముఖ్యమైన కాలమిది. తొలకరి వానలకు ముందుగా నాలుగుసార్లు దుక్కి దున్ని విత్తనాలు నాటుతాడు. మొక్క మొలకెత్తింది మొదలు దాన్ని పసి బిడ్డను చూసినట్లు అపురూపంగా చూసుకుంటాడు. కలుపుతీస్తాడు, మందులు వేస్తాడు. పంట చేతికందే సరికి అతివృష్టో లేదా అనావృష్టో ఆ పైరు ఎండిపోవడమో, కొట్టుక పోవడమో జరుగుతుంది. విత్తనాల ఖర్చులు కూడా తిరిగి రాని దయనీయ స్థితిలో రైతు ఉంటాడు. అలాంటి సమయంలో నిరాశ నిస్పృహకు లోనై, చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడు తుంటాడు. ఈ సమయంలో ప్రభుత్వం గనుక ఆదుకుంటే ఏ సమస్య ఉండదు. రైతు కుటుంబం బాగుపడుతుంది. కానీ ప్రకృతి వైఫరీత్యాలకు పాలకులు బాధ్యత వహించడం లేదు. ఏదైనా చేద్దామనుకున్నా కంటితుడుపు సాయం ప్రకటిస్తారు. రైతు పూర్తికాలం వ్యవసాయం రంగంలో బతకాలంటే ఇది ఏ మాత్రం సరిపోదు.
వ్యవసాయం అంటే పండినా, పండక పోయినా రైతు నిరాశ చెందకుండా ముందుకు సాగే పరిస్థితి రావాలి. తరతరాలుగా చూస్తున్నా పాలకుల్లో వారిని బాగుపరిచే ఆలోచన రావడం లేదు. మన దేశంలో సాగు రంగంలో దండుగ! పండుగ రెండూ ఉంటాయి. ఈ రంగంలో ఒక యేడు పండితే? మరో యేడు పండదు.అయినా పండలేదని రైతు కాడి,మేడి వదిలేస్తే.. అందరికీ ఆహారం ఎలా?.ప్రకఅతి విపత్తులకు తోడు పాలకుల ఉదాసీనత, వ్యాపా(దళా)రుల దోపిడీ, నాసిరకం విత్తనాలు, నకిలీ పురుగుమందులు, నాణ్యతలేని ఎరువులు ఇలా అనేక విధాలుగా అష్ట కష్టాలైనా అనుభవిస్తూ, అధిగమిస్తూ పంట పండిస్తారు రైతులు. చివరకు పండిన పంట అమ్ముకునే నాటికి గిట్టుబాటు ఉండదు. అయినా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతు ప్రకృతి మీద భారమేసి మళ్లీ సాగు మొదలుపెడతాడు. ఇందు లో అన్నదాతకు సహకరించేది అంతో ఇంతో ఉందంటే అది ప్రకృతి తప్ప ప్రభుత్వం కాదు! అందుకే రైతుల పట్ల పాలకుల బాధ్యత పెరగాలి. దేశంలో సాగు రంగాన్ని తరతరా లుగా పట్టిపీడి స్తున్న ఆత్మహత్యల సామాజిక రుగ్మతను తరిమే యాలి. సాగులో నష్టాలు వచ్చినా, వారికి ఆర్థిక సహాయం అందించాలి. అన్న దాతల కుటుం బాల్ని కాపాడు కోవాలి.అప్పుడే రైతు రాజవుతాడు. అప్పటివరకు తన చేలో ఒక కూలీగానే ఉంటాడన్న సంగతి పాలకులు మరవకూడదు.
– మేకిరి దామోదర్, 9573666650
రైతు రాజయ్యేదెన్నడు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES