Thursday, June 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినరాలు, కండరాలు నిర్వీర్యమవుతున్న వేళ…

నరాలు, కండరాలు నిర్వీర్యమవుతున్న వేళ…

- Advertisement -

భవ్యమైన భవిష్యత్తుతో వికసించే నవ్య భారతాన్ని నిర్మించే క్రమంలో ఏ దేశానికైనా బలం యువశక్తి. కానీ ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్న మద్యం యువకిశోరాలపై దుష్ప్రభావం చూపుతున్నది. మరోపక్క మాదకద్రవ్యాల మత్తులో యువశక్తి చిత్తవుతున్నది. వ్యసనంగా మారిన చరవాణితో నేటి యువత కట్టు బానిసవుతుంది. అనేక దురాలవాట్లతో వ్యసనానికి లోనవుతున్నది.దీన్ని అదుపు చేయాల్సిన కుటుం బం, ప్రభుత్వం, విద్యావ్యవస్థ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. సంతోషం ,సంబరం, వినోదం, విషాదం ఏదైనా సామూహిక విందు విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం తర్వాత అలవాటుగా మారి యువతను చిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అత్యధికంగా మద్యం వినియోగ సగటు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ అని సర్వేలు చెబుతున్నాయి. మద్యపానం మొదలుపెట్టే సగటు వయసు గతంలో పంతొమ్మిదేండ్లు ఉండగా గత దశాబ్ద కాలం నుండి పదమూడేండ్లకు దిగజారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అలవాటు మరింత ఎక్కువగా ఉంది. మొదట తాటి,ఈత కల్లుతో సరదాగా ప్రారంభమైన అలవాటు బీరు,విస్కీ ఇతర బ్రాండ్లకు బానిసను చేస్తున్నది. తెలంగాణలో దాదాపుగా నాలుకోట్ల జనాభా ఉండగా 15-49 ఏండ్ల మధ్య వయసు వారిలో యాభై శాతం మంది మద్యం తాగుతున్నట్లు జాతీయ కుటుంబ సర్వే వివరాలు తెలుపుతున్నాయి. చట్ట వ్యతిరేకం గా పెద్ద ఎత్తున తయారవుతున్న నకిలీ, కల్తీ మద్యం యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతు న్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు ప్రధాన ఆదాయ వనరు కావడంతో గ్రామ గ్రామా న బెల్ట్‌ షాపుల పేరుతో అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉద్వేగాల నేల తడబడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దశాబ్దం గడిచిన ఈ తరుణంలో మద్యం మాదకద్రవ్యాలు జంటగా విజృంభిస్తూ యువతను నాశనం చేస్తున్నాయి. సాధారణంగా మత్తుకు అలవాటు పడటం అనేది టీనేజీలో ఎక్కువగా ప్రారంభమ వుతుంది. దీనికితోడు గంజాయితోపాటు నల్లమందు బ్రౌన్‌ షుగర్‌, కొకైన్‌, హెరాయిన్‌ వంటి మత్తు పదార్థాల కు బానిసవుతున్నారు. మాదకద్రవ్య వినియోగ దారుల సంఖ్య పరంగా పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ తర్వాత తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్నారు. మాదకద్రవ్య అలవాటు వల్ల యువకుల్లో దేహదారుఢ్యం, మానసిక స్థిరత్వం లోపిస్తూ కండరాలు, నరాలు నిర్వీర్యమవుతున్నాయి. మాదక ద్రవ్యాల మత్తులో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మనిషి జీవితంలో సెల్‌ఫోన్‌ విడదీయరాని బంధంగా మారిపోయింది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వాట్సాప్‌ ఇతర సామాజిక మాధ్యమాలు వెదజల్లుతున్న కాలుష్యం యువతను కాటు వేస్తున్నది. తిరుగుబాటు స్వభావం, అసూయ, తల బిరుసుతనంతో తమ చదువును తెలివితేటలను సరైన విధంగా ఉపయోగించు కోలేకపోతున్నారు. ప్రమాణాలు లోపించిన విద్యే కాదు, వ్యసనంలా మారిన చరవాణి వినియోగం దేశ భవితకు గొడ్డలిపెట్టుగా మారుతున్నది. విశృంఖల శృంగారాన్ని ప్రోత్సహించే వెబ్‌సైట్లు యువతలో విష భావాలను నాటుతున్నాయి. మద్యం మాదకద్రవ్యాల కన్నా ఇవి ప్రమాదకరమైనవి. సెల్‌ఫోన్‌ వల్ల నైతిక విలువలు విచక్షణ జ్ఞానం వివేచన కోల్పోయిన నేటి యువత నేటి సమాజానికి భారంగా మారుతున్నది.
అయితే ఉత్తమ జీవన విలువలకు సమున్నత వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడేదిగా విద్యా వ్యవస్థ ఉండాలి. కళాశాలలు, యూనివర్సిటీలు చాపకింద నీరులా విస్తరిస్తున్న విషపు పోకడల నుంచి యువతను బయటపడేయడానికి వారికి జీవన నైపుణ్యాల పట్ల అవగాహన కల్పించాలి. మద్యపానం, మాదకద్రవ్యాల వల్ల సంభవించిన అనర్థాలపై యువతను జాగృతం చేయాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడి నలుగురికి నీడనివ్వగలిగే యువత మన దేశానికి నిజంగానే గొప్ప వరం అవుతుంది. ప్రభుత్వాలు నాయకులు ప్రతి సంవత్సరం గొప్ప గొప్ప జాతీయ నాయకుల జాతీయ దినోత్సవాలు జరుపుతూ కేవలం గంభీర ఉత్తేజకర ప్రసంగాలకే పరిమితం కారాదు. యువత ఆశలు, ఆశయాలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించ డానికి ఆచరణీయ ప్రణాళికలను చేపట్టాలి.అప్పుడే యువతరం భారత సామాజిక ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలబడగలుగుతుంది.
అంకం నరేష్‌
6301650324

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -