ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శలు
భోపాల్ : ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఫోన్ చేసి ‘లొంగిపోండి’ అనగానే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లొంగి పోయారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. భోపాల్లో మంగళవారం జరిగిన కాంగ్రెస్ సంగతన్ శ్రాజన్ అభియాన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ, బీజేపీ నాయకులపై వ్యంగ్య విమర్శలు చేశారు. అలాగే, సొంత పార్టీ నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ నాయకులు నిరాశలో ఉన్నారని, అర్థంలేని ప్రకటనలు చేస్తున్నా రని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని ‘కుంటి గుర్రాలు’ త్వరలోనే పదవీ విరమణ చేస్తాయని హెచ్చరించారు.
‘నాకు ప్రస్తుత బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల గురించి బాగా తెలుసు. వారిపై కొంచెం ఒత్తిడి తెచ్చి, కొంచెం నెట్టండి. వారు భయంతో పారిపోతారు. ఉదాహరణకు ట్రంప్ ఒక్క ఫోన్ చేసి ‘మోడీ జీ, మీరు ఏం చేస్తున్నారు? లొంగిపోండి’ అనగానే మన ప్రధాని మోడీ ‘ఎస్ సార్’ అని చెప్పి ట్రంప్ మాటను పాటించారు’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా 1971 యుద్ధం గురించి రాహుల్ గుర్తు చేశారు. ‘ఫోన్ కాల్స్ లేని 1971 యుద్ధ సమయంలో ఒక విమానం వచ్చింది. అయినా ఇందిరా గాంధీ ‘నేను చేయాల్సింది నేను చేస్తాను’ అని అన్నారు. అదే తేడా. అదే వ్యక్తిత్వం. వారంతా (బీజేపీ) ఇలాగే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వారికి లొంగిపోయే లేఖలు రాసే అలవాటు ఉంది. అయితే గాంధీ జీ, నెహ్రూ, సర్దార్ పటేల్.. లొంగిపోయిన వ్యక్తులు కాదు. అగ్రరాజ్యాలను ఎదిరించిన వ్యక్తులు’ అని రాహుల్ తెలిపారు. అలాగే, మోడీ ప్రభుత్వం కుల గణన చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా ఎన్నికల కోసమే అని విమర్శించారు. మహిళా రిజర్వేషన్లను పదేళ్లు వెనక్కి నెట్టారని, కులగణనను కూడా అలానే చేస్తారని రాహుల్ విమర్శించారు.
అలాగే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో సరైన నాయకులు ఉన్నారని, కానీ వారి చేతులు కట్టివేయబడ్డాయని అన్నారు. ”రాష్ట్రంలో కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సిద్ధాంత నాయకులకు కొరత లేదు. బిజెపిని ఓడించగల ప్రతిభతో నిండి ఉంది. కానీ మీ చేతులు కట్టివేయబడ్డాయి’ అని గాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకులను జాతి గుర్రాలు, పెళ్లి గుర్రాలు, కుంటి గుర్రాలుగా రాహుల్ విభజించారు. కుంటి గుర్రాలు పదవీ విరమణ చేయాల్సిందేనని చెప్పారు.
ట్రంప్ ఫోన్ చేయగానే..మోడీ లొంగిపోయారు
- Advertisement -
- Advertisement -