– ఎన్ని రోజులు పస్తులుండాలి
– వ్యకాస ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
‘ఎండలో మేము పని చేస్తే.. రోజుకు వంద రూపాయల కూలి ఇస్తారు.. అది కూడా సక్రమంగా ఇవ్వకుంటే ఎన్ని రోజులు పస్తులతో పని చేయాలి?.. పని చేసే చోట కనీస సౌకర్యాలూ కల్పించడం లేదు..’ అంటూ ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టానికి నిధులు, పని దినాలను, కూలీల జాబ్ కార్డుల్లో పెద్దఎత్తున కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 15 కోట్ల పని దినాల అవసరం ఉందని, పైగా గత సంవత్సరం 8 కోట్ల పని దినాలను ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు 6:5 కోట్లకు తగ్గించిందని వివరించారు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు, జాబ్ కార్డు నెంబరు లింకు పేరుతో దేశంలో 7.6 లక్షల కోట్ల జాబ్ కార్డులను తొలగించినట్టు పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటించడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. చేసిన పనికి కూలి కూడా సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. ఎన్ని నెలలు పస్తులతో ఉండాలని ప్రశ్నించారు. కేరళ వామపక్ష ప్రభుత్వం మాదిరిగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పని కల్పించాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆధార్ బేస్ చెల్లింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలోనే జాబ్ కార్టు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, కూలీలకు వేతనాలు గతంలో మాదిరిగా మాన్యువల్ పేమెంట్ను చెల్లించాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశంలో కనీస సౌకర్యాలైన మంచినీళ్లు, మెడికల్ కిట్టు, టెంటు, పనిముట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవో సుదర్శన్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ జంపాల స్వరాజ్యం, నాయకులు సోమపంగా జానయ్య, నల్ల మేకల అంజయ్య, షేక్ సైదాహుస్సేన్, మిట్టపల్లి లక్ష్మి, ఆరే రామకృష్ణారెడ్డి, గుంజ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు మేకనబోయిన శేఖర్, వల్లపు దాసు సాయికుమార్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ జహంగీర్, నాయకులు కిన్నెర వెంకన్న, బుడిగే ధనుంజరు గౌడ్, సిరికొండ చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చే రూ.వంద ఎప్పుడిస్తారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES