రెండేండ్లుగా నియామకాలపై ముఖం చాటేస్తున్న సీఎం
రాష్ట్రంలో జీరో రిక్రూట్మెంట్
సీఎం ముక్కునేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అందలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి ముఖం చాటేస్తున్నారనీ, మాటతప్పినందుకు ఆయన ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరని అన్నారు. ఈ మేరకు మంగళశారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తొలి ఏడాది రెండు లక్షల నియామకాలు చేపట్టకపోతే ప్రభుత్వాన్ని దించేయం డని ఢిల్లీ నుంచి వచ్చి మరీ చెప్పిపోయిన ప్రియాంక గాంధీ మాట అమలై ఉంటే, రేవంత్ సర్కారు కుప్పకూలి ఇప్పటికే ఏడాది పూర్తయ్యేదని విమర్శిం చారు. కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న 65 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి, ఫొటోలకు ఫోజులు కొట్టిన సీఎం, ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేయడంతో రాష్ట్రం జీరో రిక్రూట్మెంట్గా మారిపోయిందన్నారు. 1.65 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన బీఆర్ఎస్పై పనిగట్టు కుని బురదజల్లి అబద్ధాలతో అందలం ఎక్కడానికేనని అందరికీ అర్థమైపోయిందని తెలిపారు.
జాబ్ క్యాలెండర్కు పాతర
జాబ్ క్యాలెండర్కు కాంగ్రెస్ ప్రభుత్వం పాతరేసిందని కేటీఆర్ విమర్శించారు. వరుస కుంభకోణాలతో రేవంత్ సర్కారు జేబులు నింపుకుంటున్న తీరును తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు, విద్యార్థులు వెంటాడుతారని తెలిపారు. మేధావుల ముసుగు వేసుకుని మాయమాటలతో మభ్యపెట్టిన గొంతులన్నీ గత రెండేండ్ల నుంచి మూగబోయాయన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. మూడు దఫాలుగా రైతుబంధు ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారనీ, సీఎం సీటుపై కూర్చున్న మరుక్షణంలోనే ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తానని చెప్పిన మాటకు రెండేండ్లయినా అమలు కాకపోవడంతో ఆడబిడ్డలు కోపంతో రగిలిపోతున్నారని చెప్పారు. ఆరు గ్యారెంటీలన్నీ గారడీలేననీ, 420 హామీలన్నీ నయవంచన మాత్రమేనని విమర్శించారు.
2 లక్షల ఉద్యోగాలేవి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



