నవతెలంగాణ-హైదరాబాద్ : హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తాజాగా ఓ వివరణ ఇచ్చింది. వీసా ఫీజు పెంపు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అది కూడా వన్ టైమ్ ఫీజు మాత్రమేనని వార్షిక ఫీజు కాదని పేర్కొంది. ఇప్పటికే హెచ్ 1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు ఈ పెంపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టతనిచ్చారు.
హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ లక్ష డాలర్ల రుసుము విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావొచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు.